కోర్టులు తమాషా చూస్తున్నాయి: ‘న్యాయం’ఎప్పుడంటూ నిర్భయ తల్లి ఆక్రోశం
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కానీ.. ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పాటియాలా హౌస్ కోర్టు సోమవారం మరోసారి స్టే విధించిన విషయం తెలిసిందే.

మన వ్యవస్థల వైఫల్యమే..
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశా దేవి ఢిల్లీ కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు ప్రక్రియ పదే పదే వాయిదా వేయడం.. మన వ్యవస్థ వైఫల్య్యాన్ని చూపిస్తోందని అన్నారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా.. పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించడంతో మరోసారి వాయిదా పడింది.

దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు..
న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటోందని ఆశాదేవి ప్రశ్నించారు. దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తారని ఆమె నిలదీశారు. దేశం, ప్రపంచం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. వ్యవస్థ నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నట్లు భావన కలుగుతోందని నిర్భయ తల్లి అన్నారు.

కోర్టులు తమాషా చూస్తున్నాయంటూ...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడటం ఇదే మూడోసారి అని ఆమె గుర్తు చేశారు. రోజు రోజుకు సహనం క్షీణిస్తోందని.. అయినా దోషులకు శిక్షపడే వరకు తాము పోరాడతామన్నారు. నిర్భయను అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన దోషులు చేస్తున్న తమాషాను కోర్టులు చూసుకుంటూ కూర్చుంటున్నాయని ఆశాదేవి ఘాటుగా స్పందించారర.

2012లో అత్యంత దారుణంగా..
నిర్భయ తల్లి బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను కూడా అని ఆశా దేవి భర్త బద్రీనాథ్ సింగ్ అన్నారు. తనకు తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నానని.. కానీ, తన కూతురుకు జరిగిన బాధను ఆమె మర్చిపోలేకపోతోందని అన్నారు. 2012లో మెడికల్ విద్యార్థి అయిన 24ఏళ్ల నిర్భయను ఆరుగురు నిందితులు దేశ రాజధానిలో సామూహిక అత్యాచారం, చేసి దారుణంగా హత్య చేశారు. ఆరుగురిలో ఒకడు ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరో నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ ఠాకూర్, ముకేష్లకు న్యాయస్థానం ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
Recommended Video


ఉరిశిక్ష అమలు మూడోసారి వాయిదా..
కాగా, నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ఢిల్లీ పాటియాలా కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే కొనసాగించాలని స్పష్టం చేశారు. నిర్భయ దోషుల శిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మొదట జనవరి 22న శిక్ష విధించాల్సి ఉండగా.. జనవరి 31కి వాయిదా పడింది. ఆ తర్వాత జనవరి 31 నుంచి మార్చి 3కు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications