చిన్నారుల వ్యాక్సిన్ కోసం ట్రయల్స్- భారత్ బయోటెక్కు డీసీజీఐ గ్రీన్సిగ్నల్
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కరోనా రెండోదశలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటి ఉత్పత్తికి భారీ గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో మూడో దశ కరోనా వ్యాప్తి ప్రభావం చిన్నారులపై ఉండొచ్చన్న అంచనాలతో వ్యాక్సిన్ తయారీ సంస్ధలు ఇప్పుడు చిన్నారుల వ్యాక్సిన్ రూపకల్పనపై దృష్టిసారించాయి. ఇందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి మంజూరు చేసింది.
భారత్లో కరోనా వ్యాక్సిన్ తయారీ దారుల్లో ఒకరైన భారత్ బయోటెక్ చిన్నారులపై ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులు, యువతపై ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ఈ వయోవర్గంపై తొలిదశ ట్రయల్స్ పూర్తి కాగా, రెండు, మూడు దశల ట్రయల్స్ కోసం డీసీజీఐ ఇప్పుడు అనుమతిచ్చింది.
మొత్తం 525 అంశాలపై వేర్వేరు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ కొనసాగుతాయి. ఎయిమ్స్ ఢిల్లీ, పాట్నాతో పాటు నాగ్పూర్లోని మెడిత్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోనూ ఈ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీసీజీఐలోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఎస్ఈసీ అనుమతి మంజూరు చేసింది. మూడో దశ ట్రయల్స్కు వెళ్లే లోపే రెండో దశ ట్రయల్స్ సమాచారం తమతో పంచుకోవాలని డీసీజీఐ భారత్ బయోటెక్కు షరతు పెట్టింది. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరాపై వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ఫిర్యాదులు తమనెంతో బాధిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. తమ ఉద్యోగులు 50 మంది కరోనా బారిన పడినా వ్యాక్సిన్ తయారీకోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు సంస్ధ వర్గాలు వెల్లడించాయి.
Recommended Video