అనూహ్యంగా కరోనా వ్యాప్తి: మళ్లీ రికార్డు.. కొత్తగా33వేల మందికి: 25వేలు బలి.. ఇంకా ఎన్నాళ్లీ గోస?
'బ్రేక్ ద చైన్' అనేది కరోనా కట్టడిలో అతి ప్రధాన విషయం. స్ప్రెడర్, సూపర్ స్ప్రెడర్స్.. ఇలా వ్యక్తులను గుర్తించి, వాళ్ల కాంటాక్టులకు ట్రేస్ చేయడమనేది మొదట్లో జోరుగానే సాగింది. కానీ ఇప్పుడు కరోనా అనూహ్య రీతిలో వ్యాప్తి చెందుతున్నది. తెంచడానికి కనీసం సరైన లింకులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దేశంలో వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, ఐసీఎంఆర్ పదే పదే చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కొత్త కేసులు, మరణాల్లో రోజుకో రికార్డు నమోదవుతుండటం జనం ఆందోళనను రెట్టింపు చేస్తున్నది.
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,695. ఈ వార్త రాసే సమయానికి అది 33వేల మార్కును దాటింది. దేశంలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు రావడం ఇదే రికార్డు. బుధవారం కూడా 30వేల పైచిలుకు కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. ప్రస్తుతానికి మొత్తం కేసుల సంఖ్య 9.7లక్షలకు పెరిగింది. కేల ఉధృతిని బట్టి శుక్రవారానికి భారత్ కేసుల సంఖ్య 10లక్షల మార్కు దాటనుంది.
సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని చూడాలంటూ అనిత ఫైర్.. ఆపై సాయిరెడ్డి పంచ్
దేశంలో నమోదైన మొత్తం కేసులు 9.7 లక్షలుకాగా, అందులో 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటులోనూ భారత్ మరో రికార్డు నమోదు చేసింది. ఐసీఎంఆర్ వివరణ ప్రకారం భారత్ రికవరీ రేటు 63.24 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో 6.13లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. టెస్టుల సంఖ్యను పెంచినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం దేశవ్యాప్తంగా3,26,826 శాంపిళ్లను పరీక్ష చేశామని, ఇప్పటిదాకా మొత్తం 1.27కోట్ల టెస్టులు చేశామని అధికారులు చెప్పారు.
ఇండియాతోపాటు పలు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా కూడా మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మన దగ్గర కర్ణాటక, బీహార్, గోవా తదితర రాష్ట్రాల్లో గురువారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మరోసారి లాక్ డౌన్ చేపట్టారు. కరోనా చైన్ తెంచడం కష్టతరంగా మారిందని, వైరస్ ఎటు నుంచి వ్యాపిస్తున్నదో తెలియడంలేదని, ఒక్క కేసు కూడా లేని ప్రాంతాల్లో కుప్పలుతెప్పలుగా కొత్త కేసులు పుట్టుకురావడం ఆందోళనకరమేనని చైనా సీడీసీ సైంటిస్టులు అంటున్నారు.
ఉస్మానియాలో ఘోరంగా పరిస్థితులు.. ముంచెత్తిన మురుగు నీరు.. కేసీఆర్ పై మర్డర్ కేసన్న బీజేపీ
రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త కేసులు వెల్లువలా వస్తుండటం కలకలం రేపుతున్నది. ఇదిచాలదన్నట్లు, బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) మరో అనూహ్య విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ మొదటి వారంలోగా మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 35 లక్షలకు పెరుగుతుందని చెప్పింది. అంటే ఇప్పుడున్న కేసులు మూడింతలు పెరుగబోతున్నాయన్నమాట. ఐసీఎంఆర్ మాజీ సైంటిస్టులైతే సెప్టెంబర్ చివరినాటికి కేసుల సంఖ్య కోట్లకు చేరుతుందని గతంలో అంచనాలు కట్టారు. దాదాపు అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరాయి. చాలా చోట్ల క్లినికల్ ట్రయల్స్ దశ కూడా పూర్తికావచ్చింది. ఏదిఏమైనా 2021లోగా విరుగుడు మందు వచ్చే అవకాశమేలేదని సైంటిస్టులు, ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.