మరో ఆరు నెలల్లో కరోనావైరస్ ఎండమిక్గా మారే అవకాశం: థర్డ్ వేవ్పై ఎన్సీడీసీ చీఫ్ వివరణ
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, రానున్న రోజుల్లో ఎప్పటిఉండిపోయే(ఎండమిక్) దశలోకి మారే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న ఆరు నెలల్లోనే కరోనావైరస్ ఎండమిక్గా మారే అవకాశాలున్నాయిన ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతేగాక, కేవలం కొత్త వేరియంట్లు వెలుగులోకి వచ్చినంత మాత్రాన అవి తర్డ్ వేవ్ కు కారణమవుతాయని చెప్పలేమని అంటున్నారు. కరోనావైరస్ మహమ్మారి మన అంచనాలను అందని విధంగా విజృంభించింది. కానీ, రానున్న ఆరు నెలల్లోనే ఇది స్థానికంగా ఉండిపోయే ఎండమిక్ దశకు చేరుకుంటుందని, మరణాల సంఖ్య, సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్లయితే వ్యాధిని కట్టడి చేయవచ్చునని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు.
కాగా, భారతదేశంలో ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కోవిడ్ 19 మారుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే.. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనావైరస్ కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక 2022 ఆఖరు నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయి.. కరోనా ముందునాటి పరిస్థితులు తిరిగివస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దేశంలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్న కేరళ కూడా ఇప్పుడిప్పుడే ఆ సంక్షోభం నుంచి బయటపడుతోందని వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ అంత్యంత కీలకమని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 75 కోట్ల డోసులు పంపిణీ చేశారని తెలిపారు.
ఒకవేళ వ్యాక్థిన్ సమర్థత 70 శాతంగా ఉన్నట్లయితే ఇప్పటికే దేశంలో దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్లేనని ఆయన తెలిపారు. అయితే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పొందిన వారికి కూడా వ్యాధి సోకే ప్రమాదం 20 నుంచి 30 శాతం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వేరియంట్ల కారణంగా బ్రేక్ త్రూ వచ్చే అవకాశం ఉందన్నారు.
అంతేగాక, వ్యాక్సినేషన్ వల్ల కలిగే రోగ నిరోధకత శక్తి 70 నుంచి 100 రోజుల తర్వాత క్రమంగా క్షీణిస్తుందని నిపుణులు చెబెతున్నారని సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు వెలుగుచూడలేదని వెల్లడించారు. ఎం.సీ.1.2 వేరియంట్ల ప్రభావం ఇప్పటి వరకు భారతదేశంలో లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ కారణంగానే థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేయలేమన్నారు. వేరియంట్ల ప్రభావంతోపాటు యాంటీబాడీల పనితీరుపై అది ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించి కరోనాను అరికట్టేందుకు సహకరించాలని కోారు.












Click it and Unblock the Notifications