షాకింగ్ : స్త్రీల కంటే పురుషులకే కరోనా రిస్క్ ఎక్కువా? భారత్లో గణాంకాలు ఏం చెప్తున్నాయి..
ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కరోనా నెంబర్ చుట్టే తిరుగుతున్నాయి. ఏ రోజు ఎన్ని పాజిటివ్ కేసులు.. ఎన్ని మరణాలు.. ఎంతమంది రికవరీ.. క్షణ క్షణానికి మారుతున్న ఈ లెక్కలే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. నిన్నటి కంటే ఒక్క నెంబర్ తగ్గినా.. దేశాలన్నీ బిగ్ రిలీఫ్గా భావిస్తున్నాయి. అనూహ్యంగా నెంబర్ పెరిగిపోతే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాయి. కనిపించని వైరస్తో పోరాటానికి ఇప్పుడీ లెక్కలే కీలకమయ్యాయి. అసలు వైరస్ బారిన పడుతున్నవారిలో పురుషులు ఎందరు..? స్త్రీలు ఎందరు..? వైరస్ నుంచి ఎవరికి ఎక్కువ ముప్పు పొంచి ఉన్నది..

భారత్లో స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువ..
వృద్దులు,పిల్లలు,అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా వైరస్ సోకితే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నది ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటిదాకా నమోదైన గణాంకాలను పరిశీలిస్తే కొన్ని విస్తుపోయే నిజాలు కూడా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా భారత్లో మంగళవారం(ఏప్రిల్ 7) నాటికి నమోదైన కేసులను పరిశీలిస్తే.. వైరస్ సోకినవాళ్లలో 76శాతం మంది మగవారు కాగా 24 శాతం మంది స్త్రీలు ఉన్నారు. పాజిటివ్ కేసులే కాదు మరణాల విషయంలోనూ ఇదే లెక్క కనిపిస్తోంది.దీన్ని బట్టి భారత్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నట్టు స్పష్టమవుతోంది.

చైనా,ఇటలీ,స్పెయిన్,సౌత్ కొరియా.. అక్కడ కూడా ఇదే పరిస్థితి..
ఈ పరిస్థితి ఒక్క భారత్కే పరిమితం కాలేదు. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోనూ.. వైరస్ దెబ్బకు అతలాకుతలమవుతోన్న స్పెయిన్,ఇటలీ,ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అటు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలతో పోలిస్తే కరోనా సోకే పురుషులు మరణించడానికి మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. చైనా గణాంకాలను పరిశీలిస్తే.. అక్కడి మృతుల్లో 64శాతం మంది పురుషులే. ఇటలీ,స్పెయిన్,సౌత్ కొరియా,ఫ్రాన్స్,జర్మనీ లెక్కలు కూడా దాదాపు అలాగే ఉన్నాయి. ఒక్క కరోనా వైరసే కాదు.. గతంలో వచ్చిన సార్స్,మెర్స్,సాధారణ ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ఎక్కువగా ప్రభావం చూపించింది పురుషుల పైనే.

ఎందుకు పురుషుల్లోనే ఎక్కువగా..
సాధారణంగా భారత్ లాంటి దేశాల్లో కుటుంబ బాధ్యతలంటే పురుషులే చూసుకోవాలన్న ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. దానికి తగ్గట్టే చాలా కుటుంబాల్లో పోషణ,సంపాదన ఇప్పటికీ పురుషులదే బాధ్యత. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైనప్పటికీ.. కుటుంబ పెద్దగా.. ఇంటి అవసరాల కోసం ఎక్కువగా బయటకు వెళ్తున్నది పురుషులే. దానికి తోడు ధూమపానం,మద్యం,ఇతరత్రా చెడు అలవాట్లు కూడా స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ. బయోలాజికల్గా చూసుకుంటే.. స్త్రీలల్లో విడుదలయ్యే ఈస్ట్రోజన్ మహిళలను వైరస్ బారినపడకుండా రక్షించడంలో తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే కరోనా రిస్క్ స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువ అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి కరోనా విషయంలో స్త్రీల కంటే పురుషులే బలహీనులు అని చెప్పుకోవచ్చు.

సమగ్ర గణాంకాలు బయటకొస్తే తప్ప..
అయితే కరోనా వైరస్ పురుషులకే ఎక్కువ ఎటాక్ అవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా కనిపెట్టాల్సి ఉంది. అన్ని దేశాల గణాంకాలను పరిశీలించి ప్రత్యేక అధ్యయనానికి పూనుకుంటే తప్ప కచ్చితమైన ఆధారాలు బయటపడవు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరగాల్సి ఉంది. అప్పటివరకు లాక్ డౌన్,సోషల్ డిస్టెన్స్ వంటి ఆయుధాలను పక్కాగా పాటించాలి. అలా అయితేనే వైరస్ను నియంత్రించవచ్చు. పాజిటివ్ కేసుల సంఖ్య భారత్లో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ తప్ప మరో ఆయుధం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రులతో నిర్వహించే సమావేశంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడగింపుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications