Home Isolation: ఐటీ హబ్, హోమ్ ఐసోలేషన్ లో ఉంటే రెడ్ టేప్, రూల్స్, ఎవడికి వాడే కింగ్ !
బెంగళూరు: కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో హోమ్ ఐసోలేషన్ (క్వారంటైన్)లో ఉంటున్న రోగులకు ఇంతకాలం ఉన్న నియమాలలో మార్పులు చెయ్యాలని BBMP అధికారులు నిర్ణయించారు. కోవిడ్ లక్షణాలతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రోగుల ఇళ్లకు ఇప్పుడు రెడ్ టేప్ చుట్టడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ఈ ఇంట్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఐసోలేషన్ లో ఉన్నారని, మీరు జాగ్రత్తగా ఉండాలని పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇస్తున్నారు. ఇంతకాలం ఐటీ హబ్ బెంగళూరులో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారు నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం, బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ఎవడికి వాడే కింగ్
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసులకు ఏ మాత్రం కొదవలేదు. కుప్పలు తెప్పలుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా కొన్ని ఏరియాల్లోని ప్రజలు మాకేమీపట్టనట్లు ఎవడికి వాడే కింగ్ అంటూ రోడ్ల మీద తిరిగేస్తున్నారు. బెంగళూరులో కరోనా వైరస్ ను అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం, బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటికి రెడ్ టేప్ తో సీల్ డౌన్
బెంగళూరులో ప్రస్తుతం కరోనా వైరస్ లక్షణాలతో ఎవరైనా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారంటే వారి పక్క ఇంటి వాళ్లకు కూడా సమాచారం అందడంలేదు. గతంలో కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్న ఇళ్లకు బ్యారీకేడ్లు వేసి స్టిక్కర్లు అతికించేవాళ్లు. రానురాను ఆ నియమాలు పక్కనపెట్టేశారు. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వ్యక్తులు నివాసం ఉంటున్న ఇళ్లకు బీబీఎంపీ అధికారులు రెడ్ టేప్ తో సీల్ వేస్తున్నారు.
క్వారంటైన్ స్టిక్కర్లు.... శానిటైజేషన్
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు నివాసం ఉంటున్న ఇంటికి 14 రోజులు ఈ ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉంటారని, మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ అధికారులు కోవిడ్ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారి ఇళ్లకు ఓ ప్రింట్ ఔట్ అతికిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారి ఇంటి పరిరసర ప్రాంతాల్లో పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామని, కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని బీబీఎంపీ కమీషనర్ గౌరవ్ గుప్తా మీడియాకు చెప్పారు.
సీక్రెట్ గా చెప్పండి
హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వాళ్లు ఎవరైనా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి ఇళ్ల నుంచి బయటకు వచ్చి బయట సంచరిస్తే మాకు పీక్రెట్ గా సమాచారం ఇవ్వాలని చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు మనవి చేస్తున్నామని బీబీఎంపీ సౌత్ జోన్ జాయింట్ కమీషనర్ బి. శివస్వామి స్పష్టం చేశారు. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి మీద మేము నిఘా వేస్తున్నామని శివస్వామి అన్నారు.
Recommended Video
కేటుగాళ్లకు చెక్
ఇప్పటికే బెంగళూరులో లాక్ డౌన్ నియమాలు కచ్చితంగా పాటించాలని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని, వీలైనంత త్వరలో బెంగళూరులో పూర్తిగా కరోనా వైరస్ ను అరికడుతామని బీబీఎంపీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బెంగళూరులో కోవిడ్ లక్షణాలు ఉన్నా వాళ్లు సీక్రెట్ గా దర్జాగా బయట తిరుగుతున్నారని ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం, బీబీఎంపీ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది.