దేశంలో కరోనాకు 24వేల మంది బలి.. ఒక్కరోజే 30వేలు.. మళ్లీ లాక్ డౌన్.. వైరల్ ఫీవర్స్ వణుకు..
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరణాల రేటు తక్కువే అయినా, ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తూ పాండమిక్ తన సహజ లక్షణాన్ని ప్రదర్శిస్తోంది. కొత్త కేసుల నమోదులో బ్రెజిల్ ను కూడా దాటేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది. బుధవారం వెల్లడైన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మన దేశంలో కొత్తగా 30, 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొత్త కేసుల సంఖ్యలో ఇది సరికొత్త రికార్డు. అలాగే, నెమ్మదిగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 582 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 24,327కు పెరిగింది.
Recommended Video

రికవరీలు సరే కానీ..
బుధవారం నాటి 30వేల కొత్త కేసుల్ని కలుపుకొంటే భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 9.37లక్షలకు పెరిగింది. వైరస్ వ్యాప్తి చెందుతోన్న వేగాన్ని బట్టి శుక్రవారంలోపే మిలియన్ మార్కును దాటే అవకాశముంది. నిజానికి మన దేశంలో 60 శాతానికి పైబడి రికవరీ రేటుతో ఇప్పటికే దాదాపు 6లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3.2లక్షలుగా ఉంది. అయితే, కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపు మళ్లుతున్నాయి..

పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్..
తొలి నుంచి కొంచెం సేఫ్ గా కనిపించిన కర్ణాటకలో సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి భయానకంగా మారింది. దీంతో యడ్యూరప్ప సర్కారు బెంగళూరు సిటీ, శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి వారంరోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించింది. కలబుర్గి జిల్లాలోనూ ఇదే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాలో 16 నుంచి వారం పాటు లాక్ డౌన్ విధించనుండగా, నిషేధ ఉత్తర్వులు మిగతా జిల్లాలకూ వర్తింపజేసే యోచనలో నితిశ్ సర్కారు ఉంది. వెస్ట్ బెంగాల్ లోని కంటైన్మెంట్ జోన్లలో ఇప్పటికే లాక్ డౌన్ 1.0 స్థాయిలో కట్టడి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లోని తీవ్రతను బట్టి పూర్తి, మధ్యస్థ లాక్ డౌన్లు విధించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నేరుగా ప్రకటించకున్నా.. వ్యాపార సముదాయాలు ఎక్కడిక్కడే సెల్ఫ్ లాక్ డౌన్ అనౌన్స్ చేస్తున్నాయి.

బీహార్ బీజేపీ ప్రెసిడెంట్ ఫ్యామిలీ..
ముంబైలో బాలీవుడ్ బిగ్ షాట్లను కాటేసిన కరోనా.. తాజాగా బీహార్ పొలిటికల్ పర్సనాలిటీలను తాకింది. బీహార్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ జైస్వాల్, ఆయన భార్య, తల్లికి వైరస్ సోకినట్లు టెస్టుల్లో తేలింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వైద్య రంగంలో వెనుకబడ్డ బిహార్ లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటం కలవరపెడుతున్నది. బుధవారం నాటికి అక్కడ 19వేల కేసులు, 143 మరణాలు నమోదయ్యాయి.

వైరల్ ఫీవరా? కరోనానా?
కరోనా విలయానికితోడు దేశంలో సీజనల్ వ్యాధుల విజృంభణ కూడా మొదలైంది. ఏటా జూలై నెలాఖరు నుంచి నవంబరు వరకు కాలాన్ని సీజనల్ వ్యాధుల కాలంగా భావిస్తారు. ఈసారి ఓ వారం ముందుగానే సీజన్ మొదలైందా అనేంత స్థాయిలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. వైరల్ ఫీవర్ కూడా కరోనా లాంటి లక్షణాలే కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మెజార్టీ ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం, ఉన్న వాటిలో పేషెంట్ల సంఖ్య భారీగా ఉండటంతో చాలా మంది ఇళ్లలోనే ఉంటూ బాధపడుతున్నారు. తెలిసిన డాక్టర్లకు ఫోన్లు చేస్తూ సలహాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా కట్టడిలో బిజీగా ఉండటంతో వైరల్ జ్వరాలపై ఎవరు ఎలా వ్యవహరించాలనేదానిపై స్పష్టత కొరవడింది.












Click it and Unblock the Notifications