భారత్ లో తగ్గుతున్న కోవిడ్ కేసులు- ధర్డ్ వేవ్ పీక్ దాటేశామా ? నిపుణులు ఏమంటున్నారు ?
భారత్ లో కోవిడ్ 19 కేసుల్లో గతంలో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. కోవిడ్ ధర్డ్ వేవ్ ప్రభావం గతం కంటే ఇప్పుడు ప్రతీచోటా తక్కువగా కనిపిస్తోంది. అయితే ధర్డ్ వేవ్ పతాకస్దాయికి చేరినట్లేనా ఇంకా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. గతంలో వెలువడిన అంచనాల ప్రకారం కోవిడ్ ధర్డ్ వేవ్ ఈ నెలాఖరుకు పతాకస్దాయికి చేరొచ్చని తేలింది. కానీ ఇప్పుడు పరిస్దితి చూస్తుంటే ఇప్పుడే పతాకస్ధాయికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం....
తగ్గుతున్న కోవిడ్ ప్రభావం
భారత్ లో కోవిడ్ కేసుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. ఈ నెలలో కేసుల సంఖ్య వరుసగా పెరుగుతూ వచ్చింది. అయితే సంక్రాంతి నాటికి ఈ కేసుల సంఖ్య తిరిగి తగ్గుతోంది. దీంతో భారత్ లో కోవిడ్ ధర్డ్ వేవ్ పరిస్ధితిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. తాజా పరిస్దితి చూస్తే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాతో సహా అనేక నగరాలు రోజువారీ కోవిడ్ కేసులలో తగ్గుదలని చూస్తున్నాయి. దీంతో అధికారులు కోవిడ్ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతున్నామంటున్నారు. అయితే నిపుణులు మాత్రం దీంతో విభేధిస్తన్నారు.
కేసుల తగ్గుదల
డిసెంబర్ చివరి నుంచి మొదలుపెడితే జనవరి ప్రారంభం నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజువారీ కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, సోమవారం మాత్రం ఢిల్లీ, ముంబై. కోల్కతాలో గత వారం కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్యలో తగ్గుదల సహజంగానే స్ధానికంగా ప్రభుత్వాలతో పాటు ప్రజలకూ ఊరటనిస్తోంది. గతంలో ఊహించిన దాని కంటే కోవిడ్ ఓమిక్రాన్ వైరస్ లు తక్కువ ప్రభావం చూపుతున్నాయన్న భావన ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా, ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు కోల్కతా రోజువారీ కేసుల పరంగా సెకండ్ వేవ్ పీక్స్ను దాటాయి. అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రోజువారీ కేసులు తగ్గుదల నేపథ్యంలో ధర్డ్ వేవ్ గరిష్ట స్థాయిని అధిగమించినట్లే కనిపిస్తోంది.
పీక్ కు చేరలేదంటున్న నిపుణులు
ప్రస్తుతం మన దేశం కోవిడ్ ధర్డ్ వేవ్ పీక్ కు చేరిందా అంటే మాత్రం నిపుణులు లేదంటున్నారు. ప్రస్తుతం తగ్గుతున్న కేసుల్ని బట్టి కోవిడ్ ధర్డ్ వేవ్ తగ్గినట్లు చెప్పలేమంటున్నారు. కోవిడ్ ధర్డ్ వేవ్ గరిష్టస్ధాయిని లెక్కించడానికి ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య పూర్తిగా ప్రామాణికం కాదంటున్నారు. భారత్ లో ప్రస్తుతం కోవిడ్ పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పులు వచ్చాయని, అలాగే ఓమిక్రాన్ వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. పరీక్షలు చేసినప్పుడే వైరస్ ప్రభావం బయటపడుతోంది. అలాగని కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల కోవిడ్ ధర్డ్ వేవ్ పతాకస్ధాయికి చేరిపోయిందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేమనేది నిపుణుల అభిప్రాయం.
ధర్డ్ వేవ్ పీక్ గుర్తింపుకు ప్రామాణికాలివే
ధర్డ్ వేవ్ పతాకస్ధాయికి చేరిందో లేదో తెలుసుకునేందుకు ప్రస్తుత పరిస్ధితుల్లో కొన్ని ప్రామాణికాల్ని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రధానమైనవి కోవిడ్ పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో బెడ్ల ఆక్యుపెన్సీ. వీటి ఆధారంగా మాత్రమే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ధర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరిందా అన్నది చెప్పగలమంటున్నారు. మరికొందరు నిపుణులైతే దేశంలో వివిధ నగరాలు, ప్రాంతాల ఆధారంగా కోవిడ్ ధర్డ్ వేవ్ పీక్ ను లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఆ విధంగా చూస్తే దేశంలోని పలు జిల్లాలు, నగరాలు, ప్రాంతాల్లో ప్రస్తుతం కోవిడ్ పీక్ స్జేజ్ లో ఉన్నట్లు భావించాలంటున్నారు. దీంతో కోవిడ్ ధర్డ్ వేవ్ పీక్ స్జేజ్ పూర్తిగా పతాకస్ధాయికి చేరలేదని అర్ధమవుతోంది.