18 ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సిన్... నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ... ఇలా రిజిస్టర్ చేసుకోండి
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం(ఏప్రిల్ 28) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. వ్యాక్సిన్ పొందాలనుకునేవారు CoWIN వెబ్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వరు. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు జనాల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం తప్పనిసరి చేసింది.
ఇలా రిజిస్టర్ చేసుకోవాలి...:
మొదట cowin.gov.in వెబ్సైట్కి లాగిన్ అవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ సెల్ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత 'రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్' పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫోటో ఐడీ ప్రూఫ్,ఇతరత్రా వివరాలు నమోదు చేయాలి. మీకేమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే... ఆ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత కుడి వైపున ఉన్న 'రిజిస్టర్' ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ సెల్ఫోన్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక... మీ అకౌంట్ వివరాలన్నీ ఆ పేజీలో కనిపిస్తాయి.
షెడ్యూల్ అపాయింట్మెంట్' అనే ఆప్షన్ ద్వారా మీ అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు.
ఒకే మొబైల్ నంబర్పై మరో ముగ్గురిని కూడా యాడ్ చేయవచ్చు. ఇందుకోసం యాడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది.
ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునేవారు.. మొదట యాప్ ఓపెన్ చేసి అందులో కోవిన్ ట్యాబ్పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి మొబైల్ నంబర్,ఓటీపీ ఎంటర్ చేయాలి.
మీరు సమర్పించిన సెల్ఫోన్ నంబర్,ఓటీపీ సరైనది అయితే.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాతి ప్రొసీజర్... పైన పేర్కొన్న కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ తరహాలోనే ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక... ఎక్కడ,ఏరోజు మీకు వ్యాక్సిన్ ఇస్తారన్న వివరాలు మీ సెల్ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.
కాగా,ఇప్పటివరకూ 45 ఏళ్లు నిండినవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇటీవలే కేంద్రం నిర్ణయించింది.