కొవిడ్ వ్యాక్సిన్: గుడ్ న్యూన్ చెప్పిన సీరం -జనవరిలోనే అదుబాటులోకి -ఫేజ్-3 కూడా సక్సెస్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని సంతోషించేలోపే 'సెకండ్ వేవ్' ముంచెత్తుతోందనే భయాలు కలవరపెడుతున్నాయి. ఈలోపే, దేశరాజధాని ఢిల్లీలో 'మూడో వేవ్' తలెత్తిందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం బుధవారం కొత్తగా 46,254 కేసులు, 514 మరణాలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రానికి తాజా లెక్కలు కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 83.53లక్షలకు, మరణాల సంఖ్య 1.24లక్షలకు పెరిగింది. వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకపోవడంతో చాలా రాష్ట్రాలు విద్యా సంస్థల పున:ప్రారంభాన్ని వాయిదా వేసుకున్నాయి. ఈ దశలో..

సీరం గుడ్ న్యూస్..
భారత్ లో కరోనా వ్యాప్తి రెండో దశ, మూడో దశపై అనుమానాలు పెరుగుతుండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య బుధవారం నాటికి 4.8కోట్లు దాటేసింది. గ్లోబల్ గా మరణాల సంఖ్య 12.24లక్షలకు పెరిగింది. ఈ దశలో కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ప్రఖ్యాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఫ్రంట్ రన్నర్ గా కొనసాగుతోన్న సీరం సంస్థ.. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ‘కొవిషీల్డ్' పేరుతో వ్యాక్సిన్ తయారు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం..

జనవరి నాటికి అందుబాటులో..
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ.. భారత్ సహా అల్పాదాయం ఉన్న దేశాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో ప్రయోగాలు తలపెట్టడం విదితమే. ప్రస్తుతం భారత్ లో ఎంపిక చేసిన 17 నగరాల్లో 1600 మంది వాలంటీర్లపై ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు. ఫేజ్2తోపాటు ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా సాగుతున్నాయని సీరం సంస్థ సీఈవో అధర్ పూనావాలా తెలిపారు. సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరిలోనే అందుబాటులోకి వస్తుందని ఆయన బుధవారం ప్రకటించారు. అయితే..

తొలి దశలో 7కోట్ల డోసులు..
కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ సహా బ్రిటన్ లో ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయినప్పటికీ, ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సకాలంలో ఆమోదాలు రావాల్సి ఉందని, అనుకున్నట్లుగా అనుమతులు వస్తేగనుక జనవరి నాటికి కొవిడ్ టీకా భారత్ లో అందుబాటులోకి వస్తుందని పూనావాలా చెప్పారు. కొవిషీల్డ్ ధరను అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్న ఆయన ఈ మేరకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. తొలి దశలో నెలకు 6 నుంచి 7 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని, తర్వాతి దశలో ఆ సంఖ్యను 10 కోట్లకు పెంచాలనుకుంటున్నట్లు పునావాలా వివరించారు.












Click it and Unblock the Notifications