Corona Lockdown: కరోనా అంటే డోంట్ కేర్, మండే ఎండలో నడిరోడ్డులో వందల మందితో గుంజీలు !
పూణే: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అమలు చేశారు. ఇలాంటి సమయంలో అనవసరంగా బయటకు వస్తే కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రభుత్వాలు పదేపేద తల మొత్తుకున్నా ప్రజలు మాత్రం వినడం లేదు. మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజురోజుకు విచ్చలవిడిగా వ్యాపించడంతో 232 మంది చనిపోయారు. ఈ దెబ్బతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అక్కడి పోలీసులకు తలనొప్పి ఎక్కువ అయ్యింది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి లేనిపోని సమస్యలు తెస్తున్న వారికి పోలీసులు తమదైన శైలిలో బుద్ది చెబుతున్నారు. పూణేలో రోడ్ల మీదకు వచ్చి హల్ చల్ చేస్తున్న వందల మందిని మండేఎండలో నడిరోడ్డులో నిలబెట్టి గుంజీలు తీపించారు. పూణే పోలీసులు వందల మందితో ఒకేసారి గుంజీలు తీయిస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడ గుంజీలు తీసిన వారు అవమానంతో ఇళ్లకే పరిమితం అయ్యారు.
Recommended Video
Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!
మహారాష్ట్రలో కరోనాకు 232 మంది మృతి
భారతదేశంలో 19, 984 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఇప్పటి వరకు 3, 870 మంది కరోనా వైరస్ తో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడ్డారు. భారతదేశంలో కరోనా వ్యాధితో 640 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 4, 669 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. మహారాష్ట్రలో మాత్రమే కరోనా వ్యాధితో 232 మంది చనిపోయారు.
దేశంలో 35 శాతం కరోనా మృతులు ఇక్కడే !
భారతదేశంలో కరోనా వైరస్ దెబ్బకు మృతి చెందిన వారిలో దాదాపు 35 శాతం మంది ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నారు. రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరిగిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలను వారి ఇళ్లకే పరిమితం చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
దేశాన్ని ఉద్దరించాలనే ఉద్దేశంతో !
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, కరోనా వైరస్ వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, దయచేసి చెప్పిన మాట వినాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు అక్కడి పోలీసులు పదేపదే ప్రజలకు మనవి చేస్తున్నారు. అయితే ఏదో దేశాన్ని ఉద్దరించాలనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు తెల్లవారకముందే బైక్ లు తీసుకుని బయటకు పోలో అంటూ వచ్చేస్తున్నారు.
మండే ఎండలో వందల మందితో గుంజీలు
మహారాష్ట్రలోని పూణే నగర పోలీసులు రోడ్ల మీదకు వస్తున్న వారికి ఇళ్లకు వెళ్లాలని పదేపదే చెప్పిచెప్పి విసిగిపోయారు. ఇక లాభం లేదని నిర్దారించుకున్న పూణే పోలీసులు బైక్ ల్లో రోడ్ల మీదకు వస్తున్న వారిని అడ్డుకుని మొదట వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. తరువాత అందర్నీ నడిరోడ్డులో మండేఎండలో నిలబెట్టి కొంత సేపు శిక్షించారు. తరువాత వందల మందిని వరుసగా నిలబెట్టి వారితో గుంజీలు తీయించారు.
వైరల్ వీడియోలతో అవమానం
పూణే పోలీసులు వందల మందితో ఒకేసారి మండేఎండలో నడిరోడ్డులో గుంజీలు తీయిస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నడిరోడ్డులో గుంజీలు తీస్తున్న వారి వీడియో క్లిప్పింగ్ లు టీవీల్లో ప్రసారం అయ్యాయి. ఈ దెబ్బతో రోడ్ల మీద అనవసరంగా తిరుగుతున్న వారు గుంజీలు తీస్తున్న వీడియోలు దేశం మొత్తం చూడటంతో వారు అవమానంతో తలదించుకుంటున్నారు. ఈ వీడియోలు చూసిన కొందరు ఎక్కడ మనం బయటకు వెళితే మనతో కూడా గుంజీలు తీయిస్తారో అనే భయంతో ఇప్పుడు బయటకు రావడం కొంచెం తగ్గించారు.