విషాదం: ఆస్పత్రి గేటు వద్దే కరోనా పేషెంట్ మృతి... కన్నీరుమున్నీరుగా విలపించిన కుమార్తె..
జార్ఖండ్లో విషాదం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ కోవిడ్ 19 పేషెంట్ ఆస్పత్రి గేటు వద్దే ప్రాణాలు విడిచాడు. ఆ వృద్దుడిని ఆస్పత్రిలో చేర్చుకోవాలని అతని కుమార్తె.. వైద్య సిబ్బంది చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి గేటు వద్దే తుది శ్వాస విడిచాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆ ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని కోల్పోయిన ఆ కూతురు తీవ్రంగా రోధించింది. ఓట్ల సమయంలోనే తాము గుర్తొస్తామని... మిగతా సమయాల్లో తమను పట్టించుకున్నవారే ఉండరని వాపోయింది.

అసలేం జరిగింది...
జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన 60 ఏళ్ల పవన్ గుప్తా ఇటీవల కరోనా బారినపడ్డారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను... మెరుగైన చికిత్స కోసం అక్కడి వైద్యులు రాంచీలోని సదర్ ఆస్పత్రికి పంపించారు. దీంతో మంగళవారం(ఏప్రిల్ 13) ఉదయం కుటుంబ సభ్యులు ఆయన్ను సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చుకోవాలని అతని కుమార్తె వైద్యులు,సిబ్బందిని కోరింది. దాదాపు అరగంట పాటు వారి చుట్టే తిరిగింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు.

కన్నీరుమున్నీరుగా విలపించిన కుమార్తె...
అప్పటికే పరిస్థితి విషమించడంతో పవన్ గుప్తా ఆస్పత్రి గేటు వద్దే తుది శ్వాస విడిచారు. సకాలంలో ఆయనకు వైద్యం అంది ఉంటే బతికేవారని... వైద్యుల నిర్లక్ష్యమే ఆయన ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 'మంత్రి గారు... అరగంట నుంచి డాక్టర్ కోసం మేము అరుస్తూనే ఉన్నాం... కానీ ఎవరూ రాలేదు... ఎవరైనా వచ్చి మా నాన్నను ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తారని అనుకున్నాం... కానీ చివరకు ఆస్పత్రి గేటు వద్దే మా నాన్న చనిపోయారు...' అంటూ ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది.

ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపణలు
జార్ఖండ్ ఆరోగ్య శాఖ,ప్రభుత్వం వైఫల్యం వల్లే తన తండ్రి చనిపోయారని యువతి ఆరోపించింది. కేవలం ఓట్ల సమయంలోనే వారు ప్రజల వద్దకు వస్తారని.. అంతే తప్ప ప్రజల సమస్యల గురించి వారికేమీ పట్టదని వాపోయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉందని... వైద్యం అందక చాలామంది చనిపోతున్నారని పేర్కొంది. మరోవైపు ఆరోగ్యశాఖ మంత్రి బనా గుప్తా మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీరోజూ పేషెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉందని... దానికి తగినట్లే అవసరమైనన్నీ పడకలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ 50శాతం సీట్లు కోవిడ్ పేషెంట్లకు రిజర్వ్ చేయాలని ఆదేశాలిచ్చామన్నారు.

ఇప్పటివరకూ 1,41,750 కేసులు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ మాట్లాడుతూ... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆమె తండ్రి చనిపోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్కు ఇంకెప్పుడు సోయి వస్తుందని ప్రశ్నించారు. జార్ఖండ్ ఆస్పత్రుల్లో కోవిడ్ 19 పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ సప్లై,వెంటిలేటర్ తదితర సదుపాయాలను పెంచాలని ఇప్పటికే దీపక్ ప్రకాశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.కాగా,జార్ఖండ్లో ఇప్పటివరకూ 1,41,750 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 1232 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications