12-15 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ రెడీ - షెడ్యూల్ ఖరారు : ఈ నెలాఖరుకు కేసులు పీక్..!!
థర్డ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. లక్షలాది కేసులు నిత్యం దేశంలో రిజిస్టర్ అవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఉపశమనంగా మారింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో ఒమిక్రాన్ సైతం వ్యాపిస్తోంది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు...దీర్ఘ కాల వ్యాధిగ్రస్తులకు బూస్టర్ డోసు అందిస్తున్నారు. ప్రస్తుత వైరస్ ను తట్టుకోవాలంటే వ్యాక్సిన్ మాత్రమే ఆయుధంగా పని చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
12 -15 వయసు వారికి వ్యాక్సిన్
దీంతో.. మరో కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..12 సంవత్సరాలకు పైగా పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే.. పిల్లలకు వ్యాక్సిన్పై తల్లిదండ్రుల్లో సైతం సందేహాలున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి చివరి నాటికి 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ) చైర్మన్ డాక్టర్ ఎన్కె అరోరా పేర్కొన్నారు.
ఈ మహమ్మారిని తేలికగా తీసుకుంటే... ఎక్కువ హాని జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా పెరిగే అవకాశముందన్నారు. పెరుగుతున్న కేసులను నిశితంగా పరిశీలిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నెలాఖరుకు కేసులు మరింత తీవ్రం
రెండు డోసులు తీసుకున్న వారిలో ఆసుపత్రిలో చేరే ప్రమాదం దాదాపు 30 రెట్లు తగ్గినట్లు గమనించామన్నారు. అన్ని టీకాలు కూడా ఇదే విధంగా ఉన్నాయన్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్తో సహా అన్ని టీకాల ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం వారి ప్రాథమిక కర్తవ్యం.. అత్యవసరం అని సూచించారు. ఫిబ్రవరి-చివరి నాటికి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఇది దశలవారీగా జరుగుతోంది. వ్యాక్సిన్ కొరత లేదు. ఈ చిన్న వయస్సు గ్రూపు కోసం తాము మా వ్యూహంతో చాలా జాగ్రత్తగా ఉన్నామని వెల్లడించారు.
మధ్య వయసు వారికి సోకే ఛాన్స్
పాఠశాలలు, కళాశాలలు తెరిచే సమయం ఆసన్నమైందని.. దీంతో పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకించి చాలా త్వరగా వ్యాపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్నా యుక్తవయస్సులో ఉన్నవారు ఇన్ఫెక్షన్ బారిన పడతారని అభిప్రాయపడ్డారు. వృద్ధులు మద్య వయస్సు వారికి కూడా సోకవచ్చని చెప్పారు.
వ్యాక్సిన్లను జాగ్రత్తగా పరిశీలించి ప్రతి ఒక్కరికీ వేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. తాము అలా చేస్తున్నామని... అయితే.. ప్రబలుతున్న వైరస్ వేరియంట్లను పరిశీలిస్తే.. ఈ వ్యాధి ఇప్పుడే ముగియదని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి పెరిగినా మన ఆరోగ్య వవస్థ బలంగా ఉందని అరోరా ధీమా వ్యక్తం చేసారు.