కరోనా వ్యాక్సిన్లపై భారీ తగ్గింపు-రూ.225కే ఇప్పుడు కోవాగ్జిన్, కోవిషీల్డ్ డోసులు
దేశవ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చినా ఇప్పటికీ పూర్తిస్దాయిలో భయాలు మాత్రం తొలగిపోలేదు. తాజాగా ఎక్స్ఈ పేరుతో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో దేశవ్యాప్తంగా రేపటి నుంచి కరోనా బూస్టర్ డోస్ లు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ల ధరలు కూడా తగ్గాయి.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్లు భారత్ లో పెద్దలందరికీ అందుబాటులోకి రావడానికి ఒక రోజు ముందు, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిషీల్డ్, కోవాక్సిన్ ధరలు సగానికి పైగా తగ్గాయి. రెండు వ్యాక్సిన్ డోస్ల ధర ఇప్పుడు రూ. 225కి తగ్గించారు. కోవిషీల్డ్ రూ.600 నుండి తగ్గించారు. అలాగే కోవాక్సిన్ ఒక్కో డోస్కు రూ.1,200 నుంచి రూ.225కు తగ్గించారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, భారత్ బయోటెక్ కోఫౌండర్ సుచిత్రా ఎల్లా ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. కేంద్రంతో చర్చించిన తర్వాత ఈ రెండు సంస్ధలు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ. 225కి తగ్గించాలని సీరం ఇన్ స్టిట్యూట్ నిర్ణయించిందని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు ఆధార్ పూనావాలా తెలిపారు. ముందుజాగ్రత్త డోస్ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరోసారి అభినందిస్తున్నట్లు ఆయన ట్వీట్ లో వెల్లడించారు.
ఆ తర్వాత భారత్ బయోటెక్ తరఫున సుచిత్రా ఎల్లా కూడా.. "#CovaxinPricingని ప్రకటిస్తున్నాము. పెద్దలందరికీ ముందుజాగ్రత్త డోస్ ను అందుబాటులో ఉంచాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం కోవాగ్జిన్ ధరను ఒక్కో డోస్ కు రూ. 1200 నుంచి రూ.225కి సవరించాలని నిర్ణయించుకున్నామన్నారు.