జోరుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఉత్పత్తి -డిసెంబర్ కల్లా నెలకు సీరం నుంచి 12కోట్లు, భారత్ బయో నుంచి 5.8కోట్ల డో
దేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి జోరుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొవిడ్ టీకాలు, తయారీ సంస్థల సామర్థ్యంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో వివరణ ఇచ్చారు.
ఈ నెల(ఆగస్టు) నుంచే టీకా ఉత్పత్తి పెంపును ప్రారంభిస్తున్నట్లు మంత్రి మాడవీయ చెప్పారు. ఏడాది చివరి నాటికి కొవిషీల్డ్ టీకాల ఉత్పత్తిని నెలకు 120 మిలియన్ డోసులు, కొవాగ్జిన్ ఉత్పత్తిని నెలకు రూ. 58 మిలియన్ డోసులకు పెంచుతామని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మిషన్ కొవిడ్ సురక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.
అక్టోబరు - నవంబరు నాటికి మరో నాలుగు దేశీయ ఫార్మా సంస్థలు కరోనా టీకాల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ -వి టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన టీకాకు నిపుణుల కమిటీ అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇక బయోలాజికల్స్ - ఇ, నొవార్టిస్ టీకాలు కూడా రానున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 47 కోట్ల మందికి టీకాలు అందించినట్లు పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ వేర్వేరు డోసుల మిక్సింగ్పై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. వేర్వేరు డోసుల మిక్సింగ్ ప్రభావవంతగా పనిచేస్తుందని చెప్పేందుకు శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని, దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు.