రేపట్నుంచే 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం: CoWINలో రిజిస్ట్రేషన్ చేస్కోండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం, విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం నుంచి 12-14ఏళ్ల వారికి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మంగళవారం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. 12-14 ఏళ్ల వయసు పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
వ్యాక్సిన్లు కలిసిపోకుండా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
12-14 ఏళ్ల పిల్లలకు ఇచ్చే టీకాలు ఇతర వ్యాక్సిన్లతో కలిసిపోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా టీకాలు ఇచ్చేవారికి దీనిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజేశ్ భూషన్ తెలిపారు.
ఇక, 12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు అందించాలని స్పష్టం చేసింది. 2010 అంతకంటే ముందు జన్మించిన పిల్లలు ఈ టీకా తీసుకునేందుకు అర్హులని తెలిపింది. టీకా కోసం పిల్లల పేర్లను ఆన్లైన్లో కోవిన్ యాప్లో నమోదు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. లేదా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 17 లక్షల మంది చిన్నారులు 12 ఏళ్ల నుంచి.. 14 ఏళ్ల మధ్య ఉన్నట్టు సమాచారం. వారందరికీ రేపట్నుంచి(బుధవారం) టీకా ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలకు టీకాలను పంపటంతో పాటు.. ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలు, వ్యాక్సినేటర్లకు టీకా పంపిణీకి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బుధారం నుంచే 60 ఏళ్లు పైబడిన వారికే బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండో డోస్ తీసుకుని 9 నెలల గడువు ముగిసిన వారు బూస్టర్డోస్ తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తొలిడోస్ దాదాపు 106 శాతం పూర్తి కాగా,. రెండో డోస్ 97 శాతం పూర్తయింది.