టీ బిల్లు: సీమాంధ్ర ఎంపీలకు ఎస్పీ, సిపిఎం తోడు
న్యూ ఢిల్లీ: తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా లోకసభలో మంగళవారం ఆందోళనకు దిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు ఇతర పార్టీల సభ్యుల నుంచి మద్దతు లభించింది. సీమాంధ్ర ఎంపీలకు తోడుగా సిపిఎం, శివసేన, అకాలీదళ్, సమాజ్వాది పార్టీ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకించారు.
లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ముందుగా ప్రకటించినట్టు సభ మళ్లీ మంగళవారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు తిరిగి ప్రారంభమైంది. అయితే సీమాంధ్ర సభ్యులకు తోడు సిపిఎంకు చెందిన సభ్యులు కూడా తొలిసారిగా తెలంగాణ బిల్లుకు సభలో నిరసన వ్యక్తం చేశారు. వారు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. సిపిఎం సభ్యులు గతంలో లేని విధంగా సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాలతో సభ వెల్లోకి వస్తూ నినాదాలు చేశారు.
ప్రతిపక్షాలవైపు నుంచి ఎవ్వరూ సభ వెల్లోకి రాకుండా తెలంగాణ ఎంపిలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్ అడ్డుగా నిలబడినా సిపిఎంకు చెందిన సభ్యులు వారిని తోసుకుని ప్లకార్డులతో ముందుకు వచ్చి వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. సిపిఎంతో పాటు అన్నా డిఎం డిఎంకె, డిఎంకె పార్టీలకు చెందిన సభ్యులు కూడా వెల్లోకి వచ్చారు.
అయితే సిపిఎం సభ్యులు అందరూ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేయగా, డిఎంకె, అన్నా డిఎంకె పార్టీల సభ్యులు మత్స్యకారుల సమస్యలపై నినాదారు చేశారు. వారితోపాటు శివసేన, అకాలీదళ్, సమాజ్వాది పార్టీ సభ్యులు కూడా తెలంగాణ బిల్లును ఆమోదించేది లేదని నినాదాలు చేశారు.