నిజాయితీపరులను రక్షించేందుకు ఓ వ్వవస్ధ సృష్టించాలి: నారాయణ మూర్తి
బెంగుళూరు: ఇన్పోసిస్ వ్యవస్ధాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ప్రస్తుత వ్యవస్ధ తీరుతెన్నులపై స్పందించారు. దేశంలోని నిజాయతీపరులైన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలను కాపాడుకునేందుకు ఓ సమర్ధవంతమైన యంత్రాగాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నిక్కచ్ఛిగా ఉండే వారు తమ తమ పనులను నిర్భయంగా చేసుకునేందుకు తగిన వ్యవస్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో బొగ్గ గనుల కేటాయింపుల వ్యవహారంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బొగ్గు కుంభకోణం సామాన్య జనాలను భయాందోళనలకు గురి చేస్తోందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, భీకర వాతావరణం నెలకొంటే, దేశ ఆర్ధిక వ్యవస్ధ ముందుకుపోదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచిపనులను చేసిందని, నిజాయితీపరులైన రాజకీయనాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల రక్షణ అంశం కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
ఇటీవలే బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, హిందాల్కో చీఫ్ కుమార మంగళం బిర్లా తదితరులకు కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
కుమార మంగళం బిర్లా తనకు ఎంతోకాలం నుంచి తెలుసునని, అతను చాలా మంచివాడని నారాయణమూర్తి కితాబిచ్చారు. బొగ్గు కుంభకోణంలో తనపై కూడా అభియోగాలు నమోదైన సందర్భంలో వారిని తప్పుబట్టడం ఎంత మాత్రం సరికాదని చెప్పారు.