టెన్షన్.. టెన్షన్.. : క్రిమినల్ చెరలో 20మంది చిన్నారులు,మహిళలు.. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
తన ఇంట్లో పుట్టినరోజు పార్టీ ఉందని చుట్టుపక్కల పిల్లలు,మహిళలను పిలిచిన ఓ వ్యక్తి.. వారందరినీ నిర్బంధించాడు. స్థానికులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి కాల్పులు జరిపాడు. అంతేకాదు,ఓ చిన్నపాటి బాంబును కూడా విసిరాడు. దాంతో వారు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం ఆ ఇంట్లో దాదాపు 20 మంది చిన్నారులు,కొంతమంది మహిళలు చిక్కుకుపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఫరుఖాబాద్లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
చిన్నారులు,మహిళలను ఇంట్లో నిర్బంధించిన అతని పేరు సుబాష్ బతమ్గా పోలీసులు గుర్తించారు. అతనో క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 200కి.మీ దూరంలో ఉన్న ఫరూఖాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసుల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.
తాము తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా.. ఇంటి కిటికీలో నుంచి తమపై కాల్పులు జరిపినట్టుగా స్థానికులు తెలిపారు.పేలుడు తీవ్రత తక్కువగా ఉండే ఓ బాంబును కూడా తమపై విసిరినట్టు చెప్పారు. ఆ సమయంలో.. 'అకారణంగా నన్ను కేసులో ఇరికించారు.' అంటూ అతను గట్టిగా అరిచినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటి వద్ద ప్రత్యేక పోలీస్ బృందాన్ని మోహరించామని,అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. అవసరమైతే ఎన్ఎస్జీ కమెండోలను కూడా రంగంలోకి దించుతామని చెప్పారు. పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడం తమ మొదటి ప్రాధాన్యత అని పోలీసులు తెలిపారు. దాదాపు అందరు సీనియర్ అధికారులు ఆ ఇంటి వద్ద మోహరించిననట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర సింగ్ నిందితుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైతే అతను తన డిమాండ్స్ గురించి ఏమీ చెప్పలేదని ఆయన తెలిపారు. చుట్టుపక్కల స్థానికులు కూడా ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు.