వీడియో: ఇంటి టాప్ ఎక్కిన మొసలి: బొమ్మ అనుకున్నారట!
బెళగావి: నీటిలో సంచరించే మొసలి అనూహ్యంగా ఓ ఇంటి పైకప్పుపై కనిపించిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణానదికి సంభవించిన అతి భారీ వరదల వల్ల సగానికిపైగా వరదనీటిలో మునిగిపోయిన జిల్లా ఇది. కృష్ణానదికి ఆణుకుని ఉండే రాయ్ బాగ్ తాలూకా పరిధిలోని ఓ గ్రామంలో ఇంటిపై కనిపించింది ఈ మొసలి. ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియట్లేదు గానీ.. సిమెంటు రేకులతో నిర్మించిన పైకప్పుగా బేఫికర్ గా తిష్టవేసింది. చాలాసేపటి వరకు అది కదలక, మెదలక ఉండిపోవడంతో మొదట్లో ఈ మొసలిని చూసి బొమ్మగా భ్రమించారట స్థానికులు. తీరా అందులో కదలికలు కనిపించడంతో ఉలిక్కి పడ్డారు. తమ సెల్ పోన్లకు పని చెప్పారు. సెల్ కెమెరాల్లో ఆ మొసలిని బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వెంటనే- వైరల్ గా మారింది ఈ వీడియో.
#WATCH A crocodile lands on roof of a house in flood-affected Raybag taluk in Belgaum. #Karnataka (11.08.19) pic.twitter.com/wXbRRrx9kF
— ANI (@ANI) August 12, 2019
కాగా- బెళగావి జిల్లాలోని పలు గ్రామాలు వరదనీటిలో మునకేశాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తోన్న లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నదీ ప్రవాహం రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. ఉత్తర కర్ణాటకలోని అయిదు జిల్లాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. బెళగావి, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, కొప్పళ జిల్లాలపై వరద ప్రభావం అసాధారణంగా పడింది. కృష్ణానదిపై మహారాష్ట్రలో నిర్మించిన కొయినా జలాశయం నుంచి సుమారు నాలుగు లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల అవుతోంది. ఫలితంగా కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. 14 సంవత్సరాల తరువాత ఆలమట్టీ గేట్లను ఎత్తడం విశేషం. అలాగే- నారాయణపుర నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో నిర్మించిన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
బెళగావి జిల్లాలోని మలప్రభ, ఘటప్రభ, మార్కండేయ, హిరణ్యకేశి, వేద్ గంగ, దూధ్ సాగర్ నదులూ పొంగిపొర్లుతున్నాయి. బెళగావి, బాగల్ కోటె, విజయపుర జిల్లాల్లో ఎడతెరిపి లేని వానల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కర్ణాటక పశ్చిమ కనుమల్లో జన్మించే తుంగ, భద్ర నదుల నీటితో బళ్లారి జిల్లా హోసపేటలో తుంగభద్ర రిజర్వాయర్ కళకళలాడుతోంది. మొన్నటి దాకా చుక్కనీరు లేని ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. టీబీ డ్యామ్ నుంచి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. దీని ప్రభావం తెలంగాణలోని మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు జిల్లాలపై పడింది. అలంపూర్ ఆలయం వద్ద తుంగభద్ర ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.