బాలుడిని మింగేసిన మొసలి; గ్రామస్తులు ఏం చేశారంటే.. షాకింగ్ వీడియో!!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో పదేళ్ల బాలుడిని మొసలి మింగేసిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై ఒక్కసారిగా భారీ మొసలి దాడి చేసింది. మొసలి బాలుడిని నదిలోకి లాక్కెళ్లి మింగేసింది.
బాలుడిని మింగిన మొసలిని పట్టుకున్న స్థానికులు
సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే అతని కుటుంబీకులు, బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పిల్లవాణ్ణి కాపాడాలనే ఉద్దేశంతో కర్రలు, తాడు, వల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. బాలుడిని మింగేసిన మొసలిని వారు నది నుండి బయటకు తీసుకువచ్చారు. కానీ మొసలి కడుపులో ఉన్న బాలుడిని ఎలా రక్షించాలి అనేది ఎవరికీ అర్థం కాలేదు. గ్రామస్తులు మొసలిని పట్టుకున్నారన్న సంఘటన గురించి సమాచారం అందుకున్న ఎలిగేటర్ విభాగం బృందం మరియు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మొసలి కడుపులో బిడ్డ కోసం తల్లిదండ్రుల ఎదురు చూపు .. చనిపోయే ఉంటాడని చెప్పిన అధికారులు
గ్రామస్తుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు ఇరు బృందాలు ప్రయత్నించాయి. అయితే సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో తమ బిడ్డ బతికే ఉంటుందని పదేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. మొసలి తమ బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని వారు డిమాండ్ చేశారు. అయితే అసలు కడుపులో ఉన్న పిల్లవాడు బ్రతికి ఉండే అవకాశం లేదని తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అధికారుల చొరవతో మొసలి మళ్ళీ నదిలోకి
మొసలి పిల్లవాడిని బయటకు పంపించే అవకాశం లేదని, అలా కాదని మొసలిని చంపినా పిల్లవాడు బ్రతికి రాడని వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఆపై అధికారుల చొరవతో మొసలి ఎట్టకేలకు మొసలిని నదిలోకి వదిలిపెట్టారు. రఘునాథ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్ తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళటంతో పాటు, చిన్నారిని మొసలి మింగేసిందని గ్రామస్తులు తెలిపారని చెప్పారు. ఇక ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.