సరిహద్దు దాటిన ప్రణయం: భారతీయ కుర్రాళ్లను పెళ్లాడేందుకు వచ్చిన పాక్ వధువులు!
సరిహద్దులు వేరైనా, నిబంధనల గోడలు అడ్డుపడినా ప్రేమ గెలిచింది. సరిహద్దు దాటి వచ్చి భారత యువకులను పెళ్లాడాలనుకున్న పాకిస్థానీ వధువుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత ఏడాది చోటుచేసుకున్న భద్రతాపరమైన పరిణామాల నేపథ్యంలో నిలిచిపోయిన సరిహద్దు వివాహాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా వీసాలు మంజూరు చేయడంతో దాదాపు 150 మంది పాకిస్థానీ వధువులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భారత్లో అడుగుపెట్టారు. దౌత్యపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఇరు దేశాల్లోని బంధుమిత్రుల ఇళ్లల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది.
సాధారణంగా పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన హిందూ కుటుంబాలు పంజాబ్లోని వాఘా-అట్టారీ సరిహద్దు మార్గం ద్వారా సులభంగా భారత్కు వచ్చి ఇక్కడి యువకులతో వివాహాలు జరిపించేవి. అయితే 2025లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ తీవ్రవాద దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్ దీనికి నిరసనగా 'ఆపరేషన్ సింధూర్' పేరిట మిలిటరీ చర్య చేపట్టింది. ఈ పరిణామాల తర్వాత భద్రతా కారణ దృష్ట్యా అట్టారీ సరిహద్దు మార్గాన్ని పూర్తిగా మూసివేసి, వీసాలను రద్దు చేయడంతో ఎంతో మంది వధూవరుల నిశ్చితార్థాలు పూర్తయినా పెళ్లిళ్లు ఆగిపోయాయి.

మస్కట్, దుబాయ్ మీదుగా భారత్కు రాక
సరిహద్దు మార్గాలు మూతపడటంతో బాధితులు పాకిస్థాన్లోని ఘోట్కీలో ఉన్న ప్రసిద్ధ శాదానీ దర్బార్ పీఠాధిపతి సంత్ యుధిష్ఠిర్లాల్ శాదానీని ఆశ్రయించారు. ఆయన చొరవతో భారత్లోని నాగ్పూర్, రాయ్పూర్, జోధ్పూర్, పూణే వంటి నగరాల్లో పెళ్లి చేసుకోవడానికి వేచి ఉన్న 150 మంది వధువుల జాబితాను భారత హోంశాఖకు సమర్పించారు. విజ్ఞప్తిని పరిశీలించిన హోంశాఖ, రోడ్డు మార్గానికి బదులుగా ఎయిర్ ట్రావెల్ రావాలనే షరతుతో వీసాలు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వధువులు దుబాయ్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి మూడో దేశాల మీదుగా భారత్కు చేరుకుంటున్నారు.
ఇంకా 300 మంది నిరీక్షణ: సంతోషంలో కుటుంబాలు
ఏళ్ల తరబడి సాగిన ఆందోళనకు తెరపడి తమ కాబోయే భార్యలు సురక్షితంగా భారత్ చేరుకోవడంతో వరుళ్ల కుటుంబాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కేవలం నాగ్పూర్ నగరంలోనే 15 వివాహాలు నిశ్చయమవ్వగా, మిగిలిన వారు వేర్వేరు నగరాలకు చేరుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. పాకిస్థాన్లో ఇంకా దాదాపు 300 మంది మహిళలు భారత్లోని తమ వరులను పెళ్లాడేందుకు వీసాల కోసం వేచి చూస్తున్నారని, వారికి కూడా త్వరలోనే అనుమతులు లభించాలని భారత్ లోని సింధీ సమూహాల ప్రతినిధులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications