ఎన్కౌంటర్లో షాకింగ్ ట్విస్ట్: జర్నలిస్ట్కు మావోల ఫోన్కాల్: కీలక సమాచారం
రాయ్పూర్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ ఎన్కౌంటర్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టుల చేతుల్లో సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా విభాగం జవాన్ బందీగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ జర్నలిస్ట్ మధ్యవర్తిగా వ్యవహరించడం కలకలం రేపుతోంది. ఆయనను మధ్యవర్తిగా మావోయిస్టులు నియమించుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పోలీసులకు చేరవేయాల్సిన ఎలాంటి సమాచారాన్నయినా ఆ జర్నలిస్ట్కే తెలియజేస్తున్నారు.
బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ సందర్భంగా రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే కోబ్రా విభాగం జవాన్ అదృశ్యం అయ్యారు. ఆయన మావోయిస్టుల చేతుల్లో బందీగా ఉన్నట్లు తేలింది. ఆయనను విడిపించడానికి సీఆర్పీఎఫ్ అధికారులు చర్యలు తీసుకుంటోన్న నేపథ్యంలో.. మావోయిస్టుల నుంచి ఓ జర్నలిస్ట్కు ఫోన్ కాల్స్ రావడం ఆసక్తి రేపింది. బిజాపూర్ కేంద్రంగా పనిచేస్తోన్న స్థానిక మీడియాకు చెందిన ప్రతినిధి ఆయన. పేరు గణేష్ మిశ్రా.
మావోయిస్టులు తనకు ఫోన్ చేశారని, తమ చేతుల్లో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ను రెండురోజుల్లోగా విడిచిపెడతామని వెల్లడించినట్లు గణేష్ మిశ్రా పేర్కొన్నారు. బుల్లెట్లు తగలడంతో గాయపడిన ఆ జవాన్కు చికిత్స చేయిస్తున్నామని తెలిపినట్లు వివరించారు. ఆ జవాన్ ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే సురక్షితంగా విడిచిపెడతామని మావోయిస్టులు తనకు చెప్పినట్లు గణేష్ మిశ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా- బిజాపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓడి సన్ని, పదమ్ లఖ్మా, కోవాసి బద్రు, నుపా సురేష్ మృతిచెందినట్లు మావోలు ఇదివరకే విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. వారంతా బస్తర్ దక్షిణ ప్రాంతాన్ని పర్యవేక్షించే దళానికి చెందిన మావోలుగా గుర్తించినట్లు చెప్పారు. మాడ్వి సుక్కల్ అనేక ఓ పౌరుడు కూడా ఎన్కౌంటర్ సందర్భంగా మృతిచెందినట్లు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని నిర్మూలించడానికి కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.