‘పెద్ద’ కష్టం: బ్యాంకు క్యూలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
కాన్సూర్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తెల్లవారితే బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు డబ్బులు దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఓ నిండు గర్భిణి.. డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చి క్యూలోనే ప్రసవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఘటనకుసంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ దేహత్ జిల్లాలోని జింజాక్ గ్రామానికి చెందిన సర్వేషా అనే 30 ఏళ్ల నిండు గర్భిణీ డబ్బు విత్ డ్రా చేసేందుకు అత్తతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు గురువారం వెళ్లింది. రోజంతా వేచి చూసినా డబ్బు దొరకలేదు.
దీంతో శుక్రవారం కూడా డబ్బు కోసం మళ్లీ ఉదయాన్నే బ్యాంకుకు వచ్చి క్యూలో నిల్చుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉన్నట్టుండి సర్వేషాకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో బ్యాంకులో ఉన్న అత్త తోటి మహిళలు కలిసి ఆమెను గదిలోకి తీసుకువెళ్లి కాన్పు చేయించారు. దీంతో సర్వేషా బ్యాంకులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
'మా కోడలు బలహీనంగా ఉన్నా మనవరాలు మాత్రం ఆరోగ్యంగా ఉందని సర్వేషా అత్త తెలిపింది. సర్వేషా భర్త అష్వేంద్ర రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పరిహారం కింద వచ్చిన మొదటి వాయిదా డబ్బు రూ.2.75 లక్షలను విత్ డ్రా చేసుకునేందుకు సర్వేషా వచ్చి అక్కడే ప్రసవించిందని అత్త శశి చెప్పారు. కాగా, అంబులెన్సు రాకపోవడంతో తల్లీబిడ్డలను బ్యాంకు నుంచి పోలీసు వ్యానులో ఆస్పత్రికి తరలించారు.