బుల్ బుల్ ఉగ్రరూపం: ఒడిశా, పశ్చిమ బెంగాల్ లపై విరుచుకుపడే అవకాశం: ఐఎండీ
Recommended Video
భువనేశ్వర్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్ బుల్ తుఫాన్ క్రమంగా ఉగ్ర రూపాన్ని సంతరించుకుంటోంది. పెను తుఫాన్ గా అవతరించనుంది. మరో ఈ నెల 11వ తేదీ రాత్రి నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒడిషాకు దక్షిణ ఆగ్నేయ దిశలో 640 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్కు దక్షిణ ఆగేయ దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.
Bulbul Cyclone: ఉత్తరాంధ్రపై బుల్ బుల్ ఎఫెక్ట్..!
శనివారం సాయంత్రానికి క్రమంగా ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు కదిలే అవకాశాలు లేకపోలేదని వెల్లడించారు. కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బుల్ బుల్ తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో ఒడిశా అప్రమత్తమైంది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దిశగా కదులుతున్నప్పటికీ దాని ప్రభావం ఒడిశాపైనా ఉంటుందని, తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హెచ్చరికలను సైతం జారీ చేసింది.
తుఫాను తీరం దాటే సమయంలో ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, క్రమంగా 90 నుంచి 110 కిలోమీటర్లకు పెరగడానికీ అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీర ప్రాంత జిల్లాల పాలనా యంత్రాంగాన్ని ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం అధికారులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేసంది. బుల్బుల్ తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడానికి యథాశక్తి చర్యలు తీసుకోవాలని కోరింది.