పెను తుఫానుగా మారి దూసుకొస్తున్న ఫొని, సముద్రం అల్లకల్లోలం, తీర ప్రాంతాలు అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనిస్తున్న ఫొని తుఫాను బుధవారం మధ్యాహ్నానికి మలుపు తిరిగి ఈశాన్య దిశ వైపు కదలనుంది. మరో రెండు రోజుల్లో తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఓ పక్క తుపాను అంటున్నారు.. మరి ఈ భగభగలు ఏంది సామీ..! 48 డిగ్రీలకు చేరుకున్న ఎండలు..!!
కోస్తాంధ్రపై ఫొని ప్రభావం
ఫొని తుఫాను ప్రభావం కోస్తాంధ్రపై కనిపించనుంది. రానున్న మూడు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 165-195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కారణంగా గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అటు ఒడిశా, బెంగాల్ రాష్ట్ర తీరప్రాంతాల్లో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయి.
అల్లకల్లోలంగా మారిన సముద్రం
ఫొని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని చోట్ల కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 2, కాకినాడలో 4, గంగవరం పోర్టులో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మే 3న తీరం దాటనున్న ఫొని
ఈశాన్య దిశగా పయనించనున్న ఫొని ఈ నెల 3వ తేదీన ఒడిశాలోని గోపాల్పూర్ - చాంద్బాలీ మధ్య దక్షిణ పూరీకి సమీపంలో తీరం దాటనుంది. ఆ తర్వాత బెంగాల్ మీదుగా పయనించి క్రమంగా వాయుగుండంగా మారి బలహీనపడనుంది. మే 5 నాటికి బంగ్లాదేశ్ చేరుకుని మరింత బలహీనపడనుంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది.