ఒడిశాలో హై అలర్ట్.. పూరీ విడిచి వెళ్లాలని టూరిస్టులకు ఆదేశం..
భువనేశ్వర్ : శరవేగంగా దూసుకొస్తున్న ఫొని తుఫాను ఒడిశా వాసులను వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫొని గంటకు 200కి.మీ వేగంతో శుక్రవారం మధ్యాహ్నం గోపాల్పూర్ - చాంద్బాలీ దగ్గర తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో తుఫాను బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశించారు.
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేత
శుక్రవారం ఫొని తీరాన్ని తాకనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు గురువారం సాయంత్రానికల్లా నగరం విడిచి వెళ్లాలని సూచించింది. ఒడిశా తీరప్రాంతంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశముండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. తుఫాను బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటుచేసింది. సహాయక కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
గతేడాది ఉత్తరాంధ్ర, ఒడిశాపై విరుచుకుపడిన తిత్లీ తుఫానును మించి ఫొని బీభత్సం సృష్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో ఈ తుఫాను కారణంగా 60మందికిపైగా మృత్యువాతపడ్డారు.