విశాఖ బీభత్సం: రంగంలో బాబు, సాయానికి కేసీఆర్ సై
హైదరాబాద్: అందర్నీ వణికించిన హుధుద్ తుపాను విశాఖ తీరంలో మధ్యాహ్నం సమయంలో తీరం దాటింది. అయితే, వణికించినంత నష్టం జరగలేదు. ప్రభుత్వం ముందుజాగ్రత్త వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా విశాఖలో శనివారం రాత్రి నుండే విద్యుత్ నిలిపివేశారు.
హుధుద్ కోసం ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని వాడుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హుధుద్ తుఫాను కారణంగా ఏపీలో ముగ్గురు చనిపోయారు. ఒడిశా రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు. హుధుద్ ప్రభావం ఏపీ, ఒడిశాల పైనే ఎక్కువగా ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు.
హుధుద్ తుఫాను నేపథ్యంలో ఒడిశాలో దాదాపు డెబ్బై వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 వేల మందిని తరలించారు. హుధుద్ కారణంగా విశాఖలో దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. సిగ్నళ్లు రావడం లేదు. సెల్ ఫోన్లు పని చేయలేదు. చాలా కార్ల పైన వృక్షాలు పడి ధ్వంసమయ్యాయి.
అపార్టుమెంట్ కుంగిపోయింది. చాలా అపార్టుమెంట్లకు పగుళ్లు వచ్చాయి. రాడర్ కేంద్రంలోకి నీరు రావడంతో దానిని నిలిపివేశారు. నేవీ, విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. భారీ హోర్డుంగులు కూలిపోయాయి. ఉత్తరాంధ్రను హుధుద్ అతలాకుతలం చేసింది. విశాఖ పైన ఎక్కువ ప్రభావం పడింది.
సాయానికి ముందుకొచ్చిన కేసీఆర్
హుధుద్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందుకు వచ్చారు. నష్టపోయిన ఏపీకి ఎలాంటి సాయం కావాలో చూడాలని సీఎస్కు కేసీఆర్ సూచించారు. తుఫానులో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు సాయం అందించేందుకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు.
చంద్రబాబు సమీక్ష
హుధుద్ తుపాను ప్రభావంపై చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్రంతో మాట్లాడామని, అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని విధాలా సాయం చేస్తామని ఇప్పటికే ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అధికారులు వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు విశాఖకు వెళ్తున్నారు. ఆయన పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. అన్ని రకాలుగా సహాయం అందిస్తామని చెప్పారు.
రాడార్ కకెక్టివిటీ తెగిపోయిందని, దీంతో తుపాన్ తీరం దాటిన సమయం తెలియడం లేదని చంద్రబాబు తెలిపారు. తుపాన్కు సంబంధించి ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీస్తే http://bhuvan-ftp.nrsc.gov.in వెబ్లింక్కు పంపవచ్చునని అన్నారు.
ఇప్పటికే చాలా మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, ఫోటోలు, వీడియోలు పంపిస్తున్నారని ఆయన తెలిపారు. సీనియర్ అధికారులందరినీ క్షేత్రస్థాయిలో సహాయకచర్యల్లో ఉన్నారన్నారు. సోమవారం ఉదయం నుంచి జిల్లాలో అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. అవసరమైతే రెండు, మూడు రోజులు జిల్లాలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఉత్తరాంధ్రలో అతలాకుతలం
సిక్కోలు ప్రజల్లో హుధుద్ తుపాన్ ఆందోళన రేకెత్తిస్తోంది. గత అర్థరాత్రి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎచ్చెర్లలో 75 బోట్లు కొట్టుకుపోయాయి. గొట్టా బ్యారేజికి వరద ఉధృతి పెరిగింది.
సంతబొమ్మాళి మండలం కొల్లిపాడులో కొబ్బరిచెట్టు విరిగిపడ్డాయి. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే నిత్యావసర సరుకులు, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లు, వంటకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో గ్రామాలను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.
20 జాతీయ విపత్తు నివారణా బృందాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం ఆర్మీ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఒక్కో టీమ్లో 55మంది సభ్యులున్న వీరు ఎచ్చర్ల మండలంలో ఒకటి. మెరైన్ పోలీస్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బోట్లు కూడా సిద్ధం చేశారు.
రైళ్ల రాకపోకలు బంద్
హుధుద్ తీవ్ర తుపాన్ ప్రభావంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే ఆదివారం పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. విశాఖ రనైల్వే డివిజన్లో హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.