Cyclone Jawad: ఏపీకి ముప్పు తప్పినా: ఆ రెండు రాష్ట్రాల్లో విధ్వంసం
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ ప్రభావం మూడు రాష్ట్రాలపై పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అస్సాంలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఒడిశా వైపు దూసుకొస్తోంది. ఈ మధ్యాహ్నం పూరి వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు.
Recommended Video
రాత్రి 11:30 గంటలకు వాతావరణ కేంద్రం విడుదల చేసిన సైక్లోన్ ట్రాకింగ్ బులెటిన ప్రకారం.. జవాద్ తుఫాన్ ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణ దిశగా బంగాళాఖాతంలో 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఇది ఈశాన్య దిశగా తీరం వైపునకు కదులుతోంది. ఈ మధ్యాహ్నం పూరి వద్ద తీరాన్ని దాటనుంది. తుఫాన్ బలహీనపడిందని, వాయుగుండంగా మారిందని వాతావరణ వాఖ పేర్కొంది.
తుఫాన్ బలహీన పడటం, ఈశాన్య దిశగా కదులుతుండటం వల్ల ఏపీకి పెను ముప్పు తప్పినట్టేనని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తుఫాన్ తీవ్రత తగ్గినా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఒడిశాలోని జగత్సింగ్ పూర్, కేంద్రపారా, మయూర్భంజ్, పూరి, కటక్, భద్రక్, బాలాసోర్, నవరంగ్పూర్ జిల్లాలపై ఈ వాయుగుండం తీవ్రత యధాతథంగా ఉంటుంది. పూరి వద్ద తీరాన్ని దాటే సమయం 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
పూరి, జగత్సింగ్ పూర్లల్లో రెడ్ అలర్ట్, బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జాజ్పూర్, కటక్, ఖుర్దా, గంజాం, గజపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. కోల్కత సహా పశ్చిమ బెంగాల్లోని దిఘా, దక్షిణ 24 పరగణ, మేదినిపూర్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాయుగుండం తీరానికి సమీపిస్తోన్న కొద్దీ సముద్రం పోటెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. సురక్షిత ప్రదేశానికి తరలించారు.
జవాద్ తుఫాన్ను తీరాన్ని దాటనున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను రంగంలోకి దింపింది. ఈ రెండు బలగాలకు చెందిన చెందిన 247 బృందాలను తీర ప్రాంత జిల్లాలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించిన ప్రత్యేకాధికారి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. ముందస్తు చర్యగా దీనికి అదనంగా మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించడంపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు.