ఓఖి ఎఫెక్ట్: ముంబైలో స్కూల్స్, కాలేజీలు బంద్, గుజరాత్ హైఅలర్ట్
ముంబై: నిన్న మొన్నటి వరకు తమిళనాడు, కేరళను వణించిన ఓఖీ తుఫాను ఇప్పుడు ముంబై, గుజరాత్ దిశగా పయనిస్తోంది. ఓఖీ తుఫాను ప్రభావం కారణంగా మంగళవారం ముంబైలోని పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి వినోద్ తావ్డే సోమవారం తెలిపారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, సింధుదుర్గా, థానే, రాయిగఢ్, పాల్గఢ్ జిల్లాల్లోని పాఠశాలు, కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ముంబై యూనివర్సిటీ, సంబంధిత కాలేజీలు మాత్రం పనిచేస్తాయని చెప్పారు. ముందుగా ప్రకటించిన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ముంబై.. నగరంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ఓఖీ తుఫాను సోమవారం రాత్రి నుంచి తీవ్ర ప్రభావం చూపనుంది. వచ్చే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సహాయక బృందాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తమయ్యాయి.
ఓఖి తుఫాను నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ముంబైతోపాటు గుజరాత్ లోని సూరత్ ప్రాంతంపై కూడా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దీంతో గుజరాత్ ప్రభుత్వం కూడా ప్రభావిత ప్రాంతాల అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. మత్య్సకారులు రాబోయే 24గంటల్లో సముద్రంలోకి వెళ్లకూడదని సూచించాయి.












Click it and Unblock the Notifications