గుజరాత్కు మోదీ రూ.1000 కోట్ల సాయం -తౌక్తే తుపాను నష్టంపై సర్వే అనంతరం ప్రకటన -మహారాష్ట్ర సంగతేంటి?
కరోనా విలయానికితోడు అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన తౌక్తే తుపాను తీర రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. తుపాను తీరం దాటిన గుజరాత్ లోనైతే భీకర పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్లో తౌక్తే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలోనూ తుపాను అనంతర పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు.
మోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్య
ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం గుజరాత్లోని భావ్నగర్కు చేరుకున్న ప్రధాని మోదీ.. సీఎం విజయ్ రూపానీతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటిస్తూ ఆర్మెలీ, గిర్సోమ్నాత్, భావ్నగర్ జిల్లాల్లో తుపాను కలిగించిన నష్టాన్ని అంచనా వేశారు. దీవ్, ఉనా, జఫ్రాబాద్, మహువాల్లోనూ మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం అహ్మదాబాద్ లో సీఎం, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. అందులో...
తౌక్తే తుపాను కలిగించిన నష్టానికి తక్షణ ఆర్థిక సాయంగా గుజరాత్ కు కేంద్రం నుంచి రూ.1000కోట్లు అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తుపాను వల్ల కలిగిన నష్టం నుంచి కోలుకునేలా గుజరాత్ కు అన్ని విధాలుగా సాయపడతామన్న ఆయన.. తౌక్తే మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షల పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి రూ. 50వేలు ఇస్తామని పేర్కొన్నారు.
గుజరాత్ లో తౌక్తే ధాటికి 12 జిల్లాల పరిధిలో 45 మంది మృతి చెందారు.16 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం కాగా.. 40 వేల చెట్లు, 70 వేలకు పైగా విద్యుత్ స్తంబాలు కూలిపోయినట్టు సీఎం రూపానీ వెల్లడించారు.
నష్టం అచనాలు భారీగా ఉన్నప్పటికీ కేంద్రం కేవలం రూ.1000 కోట్లు మాత్రమే ప్రకటించడంతో అవి ఏమూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. తౌక్తే తుపాను వల్ల మహారాష్ట్రలోనూ భారీ విధ్వంసం జరిగింది. ముంబై నగరంలో తీర ప్రాంతాల్లోని సముదాయాలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రకు కేంద్రం సహాయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు.