రతన్ టాటాకు గట్టి కౌంటర్ ఇచ్చిన సైరస్ మిస్త్రీ
నిర్ణయాధికారం ఒకే వ్యక్తి చేతిలో ఉండటం, ఆయనే హైకమాండ్గా వ్యవహరించడం అనైతికం, అనుచితం, నమ్మకద్రోహమని రతన్ పైన సైరస్ మిస్త్రీ ధ్వజమెత్తారు.
ముంబై: రతన్ టాటా, సైరస్ మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మిస్త్రీపై విశ్వాసం కోల్పోయినందుకే ఆయనను టాటా సన్స్ తొలగించిందని తాత్కాలిక ఛైర్మన్ రతన్ టాటా ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా సైరస్ మిస్త్రీ కౌంటర్ ఇచ్చారు.
నిర్ణయాధికారం ఒకే వ్యక్తి చేతిలో ఉండటం, ఆయనే హైకమాండ్గా వ్యవహరించడం అనైతికం, అనుచితం, నమ్మకద్రోహమని రతన్ పైన ధ్వజమెత్తారు. బోర్డు సమావేశాల సందర్భంగా వివిధ విషయాలపై ట్రస్టీలు విశ్వాసపాత్రత కన్నా ఎక్కువగా బుద్ధిని ఉపయోగించాలని, ప్రశ్నించడం, పరీక్షించడం, వాదించడం, పరిశీలించడం ద్వారా నిర్ణయాలను బేరీజు వేయాలన్నారు.
ఇందుకు భిన్నంగా అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకరింప జేయడం అనైతికం అన్నారు. కఠిన నిర్ణయాలను ఆలోచన లేకుండా అకస్మాత్తుగా తీసుకోవద్దని, ట్రస్టీల నిర్ణయాలను ఎక్కడికక్కడ పరీక్షించి సమన్వయం చేసుకునేందుకు బలమైన విధానం ఒకటి ఉండాలన్నారు.
ప్రత్యేకించి ఒకవేళ వారు తీసుకునే నిర్ణయాలు పరోక్షంగా వారికి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చేవయితే ఎలా అని అభిప్రాయపడ్డారు. వ్యక్తి గత గుర్తింపు కోసం తాను టాటా గ్రూప్లో చేరలేదన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలంటే టాటా గ్రూప్ దృఢంగా, ఉత్సాహంగా ఉండాలన్నారు. కాగా, నవంబర్ 10వ తేదీన టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ను తొలగించిన విషయం తెలిసిందే.