చైనాకు భారత్ షాక్ మీద షాక్, వచ్చే ఏడాది దలైలామా
న్యూఢిల్లీ: చైనాకు భారత్ మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన వార్షిక తవాంగ్ ఫెస్టివెల్లో పాల్గొన్నారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు టిబెట్కు చెందిన ఆధ్యాత్మిక నేత, బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో 2017 సంవత్సరంలో పదిహేను రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు.
టిబెట్ స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్న దలైలామా హత్యకు చైనా కుట్ర పన్నడంతో 1959లో ఆయన అక్కడి నుంచి పారిపోయారు. నాటి నుంచి శరణార్థిగా భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సుమారు లక్ష మంది టిబెటన్లు కూడా భారత్లో శరణార్థులుగా ఉన్నారు.
దలైలామాను అప్పగించాలని చైనా భారత్ను పలుసార్లు డిమాండ్ చేసింది. టిబెట్ సరిహద్దు అయిన అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ భూభామేనని చైనా ఆరోపిస్తోంది. అక్కడికి దలైలామా రాకపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కాగా, ఇటీవల అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి సరిహద్దు వివాదాలను పెంచడంతో పాటు ఇరు దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. అయితే భారత్లో భాగమైన ఆ ప్రాంతాన్ని రిచర్డ్ వర్మ సందర్శించినట్లు విదేశాంగ శాఖ ధీటుగా సమాధానమిచ్చింది.