అఫైర్: దళిత బాలుడిని కొట్టి చెట్టుకు ఉరేశారు
పూణే: అగ్రవర్ణానికి చెందిన ఓ మైనర్ బాలికతో సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో మహారాష్ట్రకు చెందిన 17ఏళ్ల దళిత బాలుడిని చంపి, చెట్టుకు వేలాడదీశారు. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని జామ్ఖేడ్ తాలూకా ఖర్దా గ్రామంలో ఈ సంఘటన సోమవారంనాడు చోటు చేసుకుంది.
నితిన్ రాజు ఆఘే అనే దళిత బాలుడు పొలంలో బాలికతో మాట్లాడుతుండడాన్ని కొంత మందితో పాటు బాలి సోదరుడు కూడా చూసినట్లు చెబుతున్నారు. దాంతో బాలుడిని కర్రలతో విపరీతంగా కొట్టి చెట్టుకు ఉరేసి చంపారు.
పోలీసులు తొలుత ప్రమాదవశాత్తుగా జరిగిన మరణంగా నమోదు చేసుకున్నారు. అయితే, దర్యాప్తులో అతన్ని కొట్టి చంపినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. బాలిక సోదరుడు సచిన్ గోలేకర్ (21)ను, శేషారావు యోయోలే (42) ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఓ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితిని కల్పించింది. దీంతో పోలీసులు గ్రామంలో మోహరించారు. మంగళవారం గ్రామస్థులు బంద్ పాటించారు. బాలికతో మాట్లాడడంతో రెచ్చిపోయినవారు బాలుడిపై దాడి చేశారని అంటున్నారు.