దళిత బాలికపై రేప్, క్రికెట్ బ్యాట్తో హత్య
ఇంట్లో ఒంటరిగా ఉన్న దళిక బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
భోపాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల దళిత బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం జరపడమే కాకుండా ఆమెను హతమార్చాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో సంచలనం సృష్టించింది.
రేవా జిల్లాలోని బండి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఆరవ తరగతి చదువుతుండేది. బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి ఆమె తల్లిదండ్రులు 25 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో పెళ్లికి వెళ్లారు. దీన్ని ఆసరాగా తీసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఇంటికి వచ్చి బాలికపై అత్యాచారం జరిపి క్రికెట్ బ్యాట్ తో కోట్టి చంపినట్లు పోలీసులు చెప్పారు.
దుస్తులు లేకుండా బాలిక మృతదేహం పడి ఉండడాన్ని గ్రామస్థులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి ఐపీసీ సెక్షన్ 376, 302, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాలిక ఇంటి తలుపు తెరచి ఉండటాన్ని బట్టి చూస్తే ఎవరో బాలికకు తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహం ఇంటికి 200 మీటర్ల దూరంలో పడి ఉంది. తాను పెళ్లికి రానని ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు.