రాహుల్ గాంధీకి దళిత సంఘాల హెచ్చరిక, పచ్చి మోసం, ఓట్లు మాత్రం కావాలి!
బీదర్ (కర్ణాటక): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (ఏఐసీసీ) రాహుల్ గాంధీ బీదర్ పర్యటనలో నిరసన తెలుపుతామని కర్ణాటక దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ఇంత కాలం దళితులను మోసం చేసిందని, ఓట్లు మాత్రం వారికి కావాలని మండిపడుతున్నారు.
బీదర్ లో నవజాగృతి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతరామప్ప మీడియాతో మాట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ తరువాత ఆ వర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోతుందని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రతి శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అనంతరామప్ప గుర్తు చేశారు.
ఎన్నికల పూర్తి అయిన తరువాత సీఎం కావడానికి అర్హతలు ఉన్న ప్రతి నాయకుడిని పక్కన పెట్టి ఒక్కలిగ, లింగాయుత తదితర కులాల వారిని సీఎం కుర్చిలో కుర్చోబెడుతున్నారని అనంతరామప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 13వ తేదీ సోమవారం రాహుల్ గాంధీ బీదర్ బహిరంగ సభలో పాల్గొంటారని, అంతకు ముందే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇవ్వాలని. లేదంటే ఆయన ప్రసింగించే సమయంలో వేలాది మంది దళితులు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తామని అనంతరామప్ప హెచ్చరించారు.