షాకింగ్: అగ్రవర్ణమహిళ వండితే తినమన్న దళితవిద్యార్థులు; అగ్రవర్ణ విద్యార్థులు చేసిన పనికి సమాధానం
సమాజంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని, అది విద్యార్థి దశ నుండే కనిపిస్తుందని తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ సంఘటనతో అర్థమవుతుంది. ఉత్తరాఖండ్లోని ఒక పాఠశాలలో ఒక దళిత మహిళ వండిన భోజనాన్ని అగ్రవర్ణాల విద్యార్థులు తినడానికి నిరాకరించడంతో, దళిత వర్గాలకు చెందిన విద్యార్థులు అగ్రవర్ణానికి చెందిన వంటమనిషి తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని తినకుండా బహిష్కరించారు.

దళిత మహిళ వండిన భోజనాన్ని నిరాకరించిన అగ్ర వర్ణ విద్యార్థులు, తర్వాత షాక్ ఇచ్చిన దళిత విద్యార్థులు
6 నుండి 8 తరగతులకు చెందిన 66 మంది విద్యార్థులలో 58 మంది శుక్రవారం హాజరయ్యారని చంపావత్ జిల్లాలోని సుఖిధాంగ్ ప్రభుత్వ సెకండరీ మరియు ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్ సింగ్ తెలిపారు. మధ్యాహ్న భోజనం వడ్డించినప్పుడు, 23 మంది దళిత విద్యార్థులు అగ్రవర్ణ భోజనమాత (వంటవారు) వండిన ఆహారాన్ని తినడానికి నిరాకరించారు అని సింగ్ చెప్పారు. దళిత భోజనమాత వండిన ఆహారాన్ని అగ్రవర్ణాల విద్యార్థులు బహిష్కరిస్తే అగ్రవర్ణ మహిళ వండిన భోజనాన్ని దళిత విద్యార్థులు బహిష్కరించారని పేర్కొన్నారు.

వంటమనిషిగా దళితురాలు ... భోజనం చెయ్యని అగ్రవర్ణ విద్యార్థులు, ఆమె తొలగింపు
వంటమనిషి పోస్ట్ కోసం మాకు 11 దరఖాస్తులు వచ్చాయని, డిసెంబరు 5న జరిగిన సమావేశంలో దళిత మహిళ అయినా సునీత దేవి ఈ ఉద్యోగానికి ఎంపికైంది అని ప్రిన్సిపాల్ సింగ్ తెలిపారు.డిసెంబరు 13న వంట చేయడానికి వచ్చిన దళిత మహిళ సునీతాదేవి వండిన ఆహారాన్ని అగ్రవర్ణాల విద్యార్థులు తినడానికి నిరాకరించడంతో పాఠశాల లో గొడవ జరిగిందని వెల్లడించారు.
ఆ తరువాత మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన వివాదం తరువాత పై అధికారులు విచారణ జరిపారని, సునీత దేవి నియామకంలో విధానపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించినట్టు పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ డిసెంబర్ 21న ఆమె పదవి నుండి తొలగించిందని ప్రిన్సిపల్ వెల్లడించారు. ఆ తర్వాత సునీత దేవి మరియు ఆమె భర్త ప్రేమ్రామ్ కుల వివక్ష గురించి ఫిర్యాదు చేస్తూ చంపావత్లోని తనక్పూర్లోని పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

ఆమె స్థానంలో వంట మనిషిగా అగ్ర వర్ణ మహిళ.. భోజనం చెయ్యని దళిత విద్యార్థులు
తదనంతరం, దేవి స్థానంలో అగ్రవర్ణానికి చెందిన మహిళ విమిలేష్ ఉప్రేతి (37)ని నియమించారు. అయితే ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం వండగా దళిత విద్యార్థులు భోజనం చేయడానికి నిరాకరించారు. తాను విద్యార్థులను మధ్యాహ్న భోజనం చేయమని ఎంతగా ఒప్పించడానికి ప్రయత్నం చేసిన వారు నిరాకరించారని ఉప్రేతి పేర్కొన్నారు.
అయితే దళిత విద్యార్థులు అగ్రవర్ణాలకు తగిన సమాధానం ఇచ్చారని ఈ విషయం తెలిసిన సునీత దేవి అన్నారు. దళిత భోజనమాత వండిన మధ్యాహ్న భోజనాన్ని అగ్రవర్ణాల విద్యార్థులు తినకపోతే అగ్రవర్ణ మహిళ వండిన భోజనం దళిత విద్యార్థులు ఎలా తింటారు అని ఆమె ప్రశ్నించారు.

విద్యార్థులను దళిత వంట మనిషి రెచ్చగొడుతుందన్న పేరెంట్ టీచర్ అసోసియేషన్
ఇదిలా ఉండగా, కొత్త వంట మనిషి తయారుచేసిన ఆహారాన్ని తినొద్దు అని సునీత దేవి పిల్లలను రెచ్చగొడుతున్నాడని పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఆరోపించింది.ఇది వివక్షకు సంబంధించిన గొడవ కాదని, సునీతా దేవి నియామకంలో జరిగిన లోపభూయిష్ట ప్రక్రియపై చెలరేగిన వివాదం అని వారంటున్నారు. సునీత దేవి ని తొలగించిన తర్వాత ఆమె పిల్లలను రెచ్చగొడుతోంది అని పేరెంట్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర జోషి అన్నారు.

దళిత మహిళను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని జై భీమ్ ఆర్మీ డిమాండ్ .. ఘటనపై విచారణ
దళిత వంట మనిషిని తొలగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. దళిత మహిళను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే భీమ్ ఆర్మీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని ఘెరావ్ చేస్తుందని ఆజాద్ అన్నారు.ఇక ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత తదనుగుణంగా సరైన చర్యలు తీసుకుంటాము అని చంపావత్ జిల్లా ముఖ్య విద్యా అధికారి ఆర్ సి పురోహిత్ అన్నారు.
దళిత విద్యార్థుల భోజన బహిష్కరణకు సంబంధించి, తాము మళ్లీ పాఠశాలకు వెళ్లి వివక్షకు సంబంధించిన ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications