కోల్ స్కాం: దాసరికి ముందస్తు బెయిల్, విదేశాలకు వెళ్లొద్దు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న కేంద్ర బోగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణ రావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా, మరో పన్నండు మంది నిందితులు శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
జార్ఖండులో బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవతవకల పైన న్యాయస్థానానికి హాజరు కావాల్సిందిగా బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హరీష్ చంద్రగుప్తాను, మరికొందరిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు.
జిందాల్ గ్రూపుకు అమరకొండ ముర్గాడంగల్ బొగ్గు క్షేత్రాన్ని కేటాయిస్తే మధుకొడా అస్థిర ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలా చూస్తామని జిందాల్ వాగ్దానం చేసినట్లు సీబీఐ పేర్కొంది. అనుచితంగా బొగ్గు క్షేత్రాన్ని పొందేందుకు జిందాల్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేశారని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది.
కాగా, దాసరి నారాయణ రావుకు బొగ్గు కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. దాసరితోపాటు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు కూడా సమన్లు పంపించింది. కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.
అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దు: న్యాయస్థానం
శుక్రవారం ఉదయం కోర్టుకు హాజరైన దాసరి, జిందాల్, మధుకొడాలకు పాటియాలా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్లవద్దని ఆదేశించింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించారు.