సాహస అవార్డు అందుకున్న మర్నాడే టెర్రరిస్టుల చేతిలో హతం
శ్రీనగర్: వీరోచిత పోరాటం చేసిన సైనికాధికారి ఒకరు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. గణతంత్ర వేడుకల్లో సోమవారంనాడు సాహస పురస్కారం అందుకున్న మర్నాడే ఉగ్రవాదుల దాడిలో వీరమరణం చెందారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో మంగళవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో 42వ రాష్ట్రీయ రైఫిల్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ మునీంద్ర నాథ్ రాయ్ మరణించారు.
త్రాల్ ప్రాంతంలోని మిందోరాలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. మృతులను ఆదిల్ ఖాన్, షిరాజ్ దార్లుగా గుర్తించారు.

ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడిన రాయ్ తుది శ్వాస విడిచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారంనాడు ఆయన యుద్ధ్ సేవా పతకం అందుకున్నారు. జవాను మనీష్ కుమార్ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డారు.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల జాడపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మరణించిన ఉగ్రవాది అదిల్ ఖాన్ మిందోరా ప్రాంతానికి చెందినవాడు.












Click it and Unblock the Notifications