5-12 ఏళ్ల లోపు పిల్లలకూ కరోనా వ్యాక్సిన్: రెండింటికి కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గట్లేదు. కోవిడ్ 19 కథ మళ్లీ మొదటికొస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందనుకున్న దశలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. ప్రస్తుతానికి ఈ సంఖ్య అదుపులోనే ఉంది. అయినప్పటికీ- పలు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,970 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 15,636గా నమోదయ్యాయి. సోమవారం విడుదలైన బులెటిన్తో పోల్చుకుంటే యాక్టివ్ కేసుల సంఖ్య 16,522 నుంచి 15,636కు తగ్గింది. మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కోవిడ్ స్థితిగతులపై సమీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు.
ఈ పరిస్థితుల మధ్య 5-12 సంవత్సరాల్లోపు పిల్లలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి రానుంది. కోర్బెవ్యాక్స్ వ్యాక్సిన్ను వినియోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 5-12 సంవత్సరాల్లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన పూర్తిస్థాయి మెడికల్ డేటాను పరిశీలించిన అనంతరం డీసీజీఐ ఈ మేరకు ఈ అనుమతులను మంజూరు చేసింది. దీనితోపాటు- గుజరాత్కు చెందిన ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్డీని కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చడానికి డీసీజీఐ అంగీకరించింది. 12 సంవత్సరాల్లోపు పైనున్న వయస్సు గల వారికి జైకోవ్డీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ వయస్సు గల వారికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను వేస్తోంది కేంద్రం. జైకోవ్డీ, కోర్బెవ్యాక్స్లను త్వరలోనే వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా- 6-12 సంవత్సరాల్లోపు పిల్లలకు ఇవ్వడానికి ఉద్దేశించిన కోవాగ్జిన్ వినియోగానికి మాత్రం డీసీజీఐ అంగీకరించలేదని తెలుస్తోంది. దీనికి ఇవ్వాల్సిన అత్యవసర వినియోగ అనుమతులను జారీ చేయలేదని తెలుస్తోంది.