కేజ్రీవి తప్పుడు ఆరోపణలే: కోర్టులో అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు మరో ఐదుగురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. వారిపై జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన మంగళవారం ఢిల్లీలో కోర్టుకు హాజరయ్యారు.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజయ్ కనగ్వాల్ ఎదుట జైట్లీ స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్, మరో ఐదుగురు తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఈ ఆరోపణలు పరువునష్టం దావా వెయ్యదగినంత తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. కాగా, జైట్లీ కోర్టుకు హాజరైన సమయంలో లోపలికి మీడియాని కూడా అనుమతించలేదు. కేవలం లాయర్లను మాత్రమే కోర్టులోకి అనుమతించారు.
కాగా, డీడీసీఏకి గతంలో జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కేజ్రీవాల్ సహా ఆప్నేతలు గతంలో విమర్శించిన విషయం తెలిసిందే.
అక్కడ జరిగిన అవినీతితో జైట్లీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు చేసిన వారిపై జైట్లీ పరువునష్టం దావా వేశారు.