ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు: మరణాలుకూడా, ఆ నగరాల్లోనే 45శాతం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి వేగంగానే జరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరో వైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
భారీగా పెరిగిన కేసులు
ఇప్పటి వరకు దేశంలో 21,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 681 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 16,319 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 4370 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్క రోజే 49 మరణాలు సంభవించాయి.
ఆ నగరాల్లోనే 45శాతం
ఏప్రిల్ 2న 211 జిల్లాకే పరిమితమైన కరోనావైరస్.. ఇప్పుడు 430 జిల్లాలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని కేసుల్లో 45 శాతం ఆరు నగరాల్లోనే ఉండటం గమనార్హం. మూడువేలకు పైగా కేసులతో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ 2081, అహ్మదాబాద్ 1298, ఇండోర్ 915, పుణె 660, జైపూర్ 537 కేసులతో ఉన్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాప్తి తగ్గుతోందని కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది.
ఈ రాష్ట్రాల్లో వేలల్లోనే కేసులు
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 60 కన్నా ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 5649 కరోనా కేసులు నమోదు కాగా, 269 మరణాలు సంభవించాయి. గుజరాత్ రాష్ట్రంలో 2407 కేసులు నమోదు కాగా, 103 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 2248 కేసులు నమోదు కాగా, 148 మరణాలు సంభవించాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 1888 కరోనా కేసులు, 127 మరణాలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1587 కేసులు, 80 మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1449 కేసులు, 21 మరణాలు సంభవించాయి. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి.