యూపీలో ఎస్పీకి వరుసషాక్ లు-బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు- అఖిలేష్ కు తలపోటుగా
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి, విపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలు ఓవైపు వెలువడుతున్న వేళ... ప్రత్యర్ధులపై ఆధిక్యం సాధించేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్ధి పార్టీల నుంచి బీజేపీ, ఎస్పీ ఇద్దరూ వలసల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ముగ్గురు మంత్రుల్ని తమ పార్టీలో ఎస్పీ చేర్చుకోగా.. ఆ పార్టీ అధినేత అఖిలేష్ మరదలు అపర్ణను బీజేపీలోచేర్చుకున్నారు.
యూపీలోని జలాల్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సుభాష్ రాయ్ ఈరోజు బీజేపీలో చేరారు. అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన కొద్ది రోజులకే సుభాష్ రాయ్ ఆ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుభాష్ రాయ్ను ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య , దినేష్ శర్మ, రాష్ట్ర బిజెపి చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ పార్టీలోకి స్వాగతించారు. రాయ్ ఇంతకుముందు బీజేపీలో ఉన్నారని, ఆయన తిరిగి పార్టీలోకి రావడం ఘర్ వాపసీ అని అన్నారు, ఇది ఈ ప్రాంతంలో బలోపేతం అవుతుంది.
సుభాష్ రాయ్ చేరికపై స్పందించిన బీజేపీ నేతలు.. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన నడుస్తోందని.. రాష్ట్రంలో శాంతి, జాతీయవాదం వెల్లివిరిశాయని, ఈ కారణాల వల్లే జలాల్పూర్ ఎమ్మెల్యే పార్టీలో చేరారని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తోందని, అభివృద్ధి, జాతీయవాద రాజకీయాలను ఆచరించాలని కోరుకునే వారు ఇతర పార్టీల నుంచి కూడా అందులో చేరుతున్నారని బీజేపీ ఎంపీ, ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బలూనీ అన్నారు.