బీజేపీని ఎక్కడో తాకిన ఖర్గే కుక్క వ్యాఖ్యలు-పార్లమెంటులో రచ్చ-అయినా తగ్గని కాంగ్రెస్ ఛీఫ్
రాజస్తాన్ లో అల్వార్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీపై చేసిన కుక్క వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని, అనంతరం దేశం కోసం ఇందిర, రాజీవ్ గాంధీల రూపంలో ఇద్దరు ప్రధానుల్ని పొగోట్టుకున్న కాంగ్రెస్ పార్టీని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని, బీజేపీ నేతల ఇంట్లో కుక్క అయినా దేశం కోసం చనిపోయిందా అని ఖర్గే వేసిన ప్రశ్న కాషాయ పార్టీని ఎక్కడో తాకింది. దీంతో ఖర్గే క్షమాపణ కోరుతూ పార్లమెంటులో బీజేపీ రచ్చ రచ్చ చేసింది.
రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై క్షమాపణ డిమాండ్ తో బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్ మాత్రం సభ బయట చేసిన వ్యాఖ్యలపై ఇక్కడ చేసేదేమీ లేదంటూ వ్యాఖ్యానించడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఖర్గే మరింత రెచ్చిపోయారు. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేందుకు నిరాకరించిన ఖర్గే.. మరింత స్వరం పెంచారు. బీజేపీ నేతల్ని ఉద్దేశించి మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
తన వ్యాఖ్యల్ని పార్లమెంట్ లో రిపీట్ చేస్తే బీజేపీకే ఇబ్బంది అంటూ మొదలుపెట్టిన ఖర్గే.. అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్షమాపణలు చెప్పిన వారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని క్షమాపణ చెప్పమని అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ 'భారత్ తోడో (విభజిత భారతదేశం) యాత్ర' చేస్తోందని బీజేపీ చెబుతోందని, అప్పుడే తాను కాంగ్రెస్ ఎప్పుడూ భారత్ జోడో (భారతదేశాన్ని ఏకం చేయడం) కోసం పని చేస్తుందని చెప్పినట్లు ఖర్గే గుర్తుచేశారు. ఇందుకోసం ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రాణాలర్పించారని, మీరు ఏం చేశారు? దేశం కోసం ఎవరు ప్రాణత్యాగం చేశారో మీకు తెలుసు" అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.