10 నెలలు టాయిలెట్లోనే బంధించి.. వివాహిత మర్మాంగాలపై దాడి!
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో అత్యంత అమానవీయమైన, ఒళ్లు గగుర్పొడిచే గృహహింస ఘటన వెలుగుచూసింది. ఓ వివాహితను ఆమె అత్తమామలు ఏకంగా 10 నెలల పాటు ఓ గదిలో, టాయిలెట్లోనే బంధించి నరకయాతన చూపించారు. తినడానికి కేవలం పచ్చిబియ్యం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మాత్రమే ఇస్తూ.. కర్రలు, బాటిళ్లతో ఆమె మర్మాంగాలపై దాడి చేస్తూ పశువులకన్నా హీనంగా హింసించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డెహ్రాడూన్లోని సెలాకుయ్ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త రాహుల్ ఖండూరి, అత్తమామలపై కేసు నమోదైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలికి రెండేళ్ల క్రితం రాహుల్ ఖండూరితో వివాహం జరిగింది. 2025 ఫిబ్రవరిలో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. భర్త ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె అత్తమామలతో కలిసి డెహ్రాడూన్లో ఉంటోంది. అయితే గతేడాది జులై నెల నుంచి ఆమెను ఒకే గదికి, టాయిలెట్కే పరిమితం చేసి క్రూరంగా హింసించడం ప్రారంభించారు. భర్త సెలవులపై ఇంటికి వచ్చినప్పుడల్లా భార్య క్షేమ సమాచారాలను పట్టించుకోకుండా.. అత్తమామలతో కలిసి ఆమెపై శారీరక దాడికి పాల్పడేవాడని బాధితురాలి తండ్రి బహుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. అత్తింటి వారివేధింపుల కారణంగా తన కూతురు మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ 10 నెలల కాలంలో నిందితులు ఆమెను డ్రైనేజీ పైపులు, ఇనుప రాడ్లు, కుర్చీలు, ఫ్లోర్ వైపర్లతో విచక్షణారహితంగా బాదినట్లు ఆయన వెల్లడించారు. అంతటితో ఆగకుండా బాటిళ్లు, కర్రలను ఉపయోగించి ఆమె మర్మాంగాలపై తీవ్రమైన గాయాలు చేశారు. ఆ క్రూరత్వం ఎంతవరకు వెళ్లిందంటే.. ఆమె తలపై ఉన్న జట్టును గట్టిగా పీకేయడంతో తల భాగమంతా పూర్తిగా గుండులా మారిపోయింది. నిరంతరం శారీరకంగా హింసించడమే కాకుండా బూతులు తిడుతూ.. నిన్ను చంపేస్తామంటూ ఆమెను నిందితులు ఎప్పుడూ బెదిరించేవారని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ 10 నెలల్లో బాధితురాలిని తన పుట్టింటి వారికి మాట్లాడటానికి గానీ, కనీసం ఫోన్ చేయనివ్వడానికి గానీ అత్తమామలు అనుమతించలేదు. పుట్టిన మనవళ్లను చూసేందుకు కూడా పుట్టింటి వారిని రానివ్వలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా.. ఆమె నిద్రపోతోందని లేదా స్నానం చేస్తోందని అబద్ధాలు చెబుతూ తప్పించుకునేవారు. "నిజానికి మా కుమార్తెను ఉదయం 9 లేదా 10 గంటల నుంచి గదిలో లేదా టాయిలెట్లోనే వేసి తాళం పెట్టేవారు. కనీసం మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా రాత్రింబగళ్లు ఆమెను పశువులా హింసించారు" అని బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.
చివరకు కూతురిని చూసేందుకు వెళ్లిన తండ్రిని ఇంట్లోకి రానివ్వకుండా అత్తమామలు అడ్డుకున్నారు. మరో 15 రోజులు ఆగి రావాలని.. మీరే మీ కూతురి కాపురాన్ని నాశనం చేస్తున్నారంటూ రివర్స్లో నిందించారు. తీవ్ర గాయాలతో నరకం అనుభవించిన సదరు మహిళను ఎట్టకేలకు రక్షించగా.. ఈ దారుణ ఉదంతం బయటకు వచ్చింది. ప్రస్తుతం పోలీసులు నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications