కేజ్రివాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీపై మాజీ ఐపిఎస్ అధికారిణి, సామాజిక కార్యకర్త కిరణ్ బేడీ తన విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. అస్థిరత్వంతో కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం నుంచి వైదొలగాలని ఆమె బుధవారం ట్విట్టర్లో డిమాండ్ చేశారు.
ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న ప్రస్తుత అస్థిర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కిరణ్ బేడీ కోరారు. రాష్ట్రంలో ఇంకా ఎలాంటి నష్టం జరగకముందే రాష్ట్రపతి ఈ చర్య చేపట్టాలని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అరాచకవాదిలా వ్యవహరిస్తున్నారని కిరణ్ బేడీ ఆరోపించారు. అరాచకవాది అంటే పరిపాలన కొనసాగించలేని, చట్ట బద్ధంగా వ్యవహరించలేని, అయోమయంలో ఉండే వ్యక్తి అనే అర్థం డిక్షనరీలో ఉందని, అలాంటి వ్యక్తే అరవింద్ కేజ్రివాల్ అని అన్నారు. అయితే కేజ్రివాల్తో తనకేలాంటి బేదాభిప్రాయాలు లేవని, కానీ అతని వ్యవహార శైలిని అంగీకరించలేనని తెలిపారు.
ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ అనుచరుల నుంచి ఎలాంటి ఆరోపణలు ఎదురైనా పరువాలేదని ఆమె అన్నారు. కానీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రివాల్ చట్ట విరుద్ధమైన పరిపాలనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాగా లోక్పాల్ బిల్లు కోసం పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పనిచేసిన కిరణ బేడీ, ఇటీవల భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే.