ఫిబ్రవరి 7న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు: 13న తిరుపతికి ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నాయని, ఫలితాలు అదే నెల 10న విడుదల కానున్నాయని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ విఎస్ సంపత్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు అఫిడవిట్లోని ప్రతీ అంశాన్ని పూరించాలని అన్నారు.
కాగా, సంపత్ నిర్వహించే ఈ ఎన్నికలే ఆయనకు చివరివి కావడం గమనార్హం. ఎందుకంటే ఆయనకు జనవరి 15తో 65ఏళ్లు నిండనున్నాయి. ఆ తర్వాత ఆయన పదవి నుంచి విరమణ చేయనున్నారు. ఢిల్లీలో 1.2లక్షల మంది రెండేసి ఓట్లను కలిగి ఉన్నారని ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమానికి ఈసీ శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం ఢిల్లీకి మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో భద్రతా పరమైన చర్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వంద కేంద్ర పారా మిలటరీ దళాలు ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఢిల్లీలో ఎన్నికల సమయంలో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు.

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయాల పరంపరను కొనసాగిస్తున్న బిజెపి.. ఢిల్లీలో కూడా పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో ఢిల్లీ బిజెపికి మంచి ఫలితాలను కట్టబెట్టింది.
2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 31 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్.. ముఖ్యమంత్రిగా కేవలం 45రోజులపాటే ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, జనవరి 14న ఢిల్లీ ఎన్నికల నోటీఫికేషన్, 21న నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు జనవరి 24. ఫిబ్రవరి 7 ఎన్నికలు, 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఫిబ్రవరి 13న తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి శాసనసభకు ఫిబవ్రరి 13న ఉప ఎన్నిక జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.












Click it and Unblock the Notifications