Delhi Assembly Election 2025: 42వేల మంది పోలీసులు, 660 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. 19 వేల హోంగార్డులు, 42వేల మంది పోలీసులు, 660 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఈ ఎన్నికల్లో పటిష్ట భద్రత నిర్వహిస్తున్నారు. 10 రాష్ట్రాల నుంచి బలగాలను మోహరించింది ఎన్నికల సంఘం. దిల్లీ భద్రతపై ఎలక్షన్ సెల్ స్పెషల్ సీపీ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు.
"దిల్లీలోని పోలీసు బలగమంతా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాలు ఏర్పాట్లు చేశారు. తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, అక్రమ మద్యాన్ని సీజ్ చేశాం. దిల్లీ వ్యాప్తంగా 3000 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి ఆ స్టేషన్స్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం." అని తెలిపారు. ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 78 కోట్ల విలువైన 196 కిలోల డ్రగ్స్, 1,008 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు.

13 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు..
దిల్లీలో మొత్తం కోటీ 56 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్(QMS)ను భారత్లో ఎన్నికల సంఘం ప్రవేశపెట్టబోతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉందో 'దిల్లీ ఎన్నికలు-2025 QMS'యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. ఇక ఇప్పటికే దాదాపు 7 వేల మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 67 చోట్ల విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62 చోట్ల ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి 8 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ రెండుసార్లూ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications