ఢిల్లీలో పట్టపగలే దోపిడీ: సెక్యూరిటీ గార్డ్ హత్య, 1.5కోట్లు అపహరణ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలే దొంగలు దోపిడీకి తెగబడ్డారు. నగదును తీసుకెళుతున్న వ్యాన్ను అడ్డగించిన ఇద్దరు దొంగలు సెక్యూరిటీ గార్డును హత్య చేసి రూ. 1.5 కోట్ల కోట్లను అపహరించారు. ఈ ఘటన ఎప్పుడూ రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కమలానగర్ సమీపంలోని బంగ్లారోడ్లోని ఏటిఎం కేంద్రంలో డబ్బులు వేసేందుకు వచ్చిన నగదు వ్యాన్ను శనివారం ఉదయం 11 ప్రాంతంలో దుండుగులు దోచుకున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును హత్య చేసి పరారయ్యారు.
ఈ ఘటనపై జాయింట్ కమిషన్ ఆఫ్ పోలీస్ సందీప్ గోయల్ మాట్లాడుతూ.. కమలానగర్, రూప్నగర్ ప్రాంతాల్లోని ప్రైవేటు బ్యాంకులకు చెందిన రెండు ఏటిఎంలలో నగదు వేసేందుకు నగదు వ్యాన్ వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.

‘ఏటిఎం యంత్రంలో సిబ్బంది డబ్బులు వేస్తున్న సమయంలో దుండగులు ఓ సెక్యూరిటీ గార్డ్ వ్యానుకు కాపలా కాస్తున్నాడు. ఆ సమయంలోనే బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు సెక్యూరిటీ గార్డు తలపై రెండు సార్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వ్యానులోని రూ. 1.5కోట్ల నగదు కలిగి ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు' అని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ఘటన స్థలంలో ఉన్న ప్రత్యక్షసాక్షులు వెంటనే తమకు ఫోన్ చేసి విషయం చెప్పారని ఆయన తెలిపారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాలతో పడివున్న సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
అయితే మార్గమధ్యలోనే సెక్యూరిటీ గార్డు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. నిందితులపై దోపిడీ, హత్యా నేరాల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సిసి కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications