బస్సులో క్లీనర్ సజీవదహనం.. మస్కిటో కాయిల్ ప్రాణం తీసిందా?
దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున ఓ భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో ఆపి ఉంచిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల నిద్రిస్తున్న బస్సు క్లీనర్ సజీవదహనమయ్యాడు.
నడిరాత్రి మృత్యుఘోష
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సుమారు 1:50 గంటలకు వికాస్పురిలో ఓ బస్సు తగులబడుతోందని సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, మంటలు ఆర్పిన తర్వాత బస్సులో తనిఖీ చేయగా.. ఒక వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది.

మృతుడిని సునీల్ శర్మగా పోలీసులు గుర్తించారు. అతను ఆ బస్సులో హెల్పర్గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను బస్సులోనే నిద్రిస్తున్నాడని, మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు రాలేక అక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ బస్సు హరియాణా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉందని, కేవలం 28 రోజుల కిందటే ఇది సర్వీసులోకి వచ్చిందని సమాచారం.
మస్కిటో కాయిల్ కారణమా?
ఈ అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ.. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్ వల్ల మంటలు అంటుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మంగోల్పురిలో మరో ప్రమాదం: సిలిండర్ పేలుడు
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లోనే ఇది రెండో భారీ అగ్నిప్రమాదం. అంతకుముందు ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో మంగోల్పురి ప్రాంతంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంట్లో మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చలికాలం కావడంతో మూసి ఉన్న ప్రదేశాల్లో కాయిల్స్, హీటర్లు వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications